
లాహోర్: సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో పాకిస్తాన్ బోణీ చేసింది. బౌలర్లు షాహిన్ ఆఫ్రిది (4/33), నోమన్ అలీ (4/79), సాజిద్ ఖాన్ (2/38) రాణించడంతో.. నాలుగు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్లో పాక్ 93 రన్స్ తేడాతో సఫారీలపై గెలిచింది. ఫలితంగా రెండు మ్యాచ్ల సిరీస్లో 1–0 లీడ్లో నిలిచింది. అలాగే సౌతాఫ్రికా పది వరుస టెస్ట్ విజయాలకు బ్రేక్ వేసింది.
277 రన్స్ టార్గెట్ ఛేజింగ్లో 51/2 ఓవర్నైట్ స్కోరుతో బుధవారం బరిలోకి దిగిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 60.5 ఓవర్లలో 183 రన్స్కు ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్ (54) టాప్ స్కోరర్. ర్యాన్ రికెల్టన్ (45) పోరాడాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు 73 రన్స్ జోడించి ఆశలు రేకెత్తించినా.. మిగతా వారి నుంచి సహకారం అందలేదు.
టోనీ డి జార్జీ (16), ట్రిస్టన్ స్టబ్స్ (2), కైల్ వెరెన్ (19), సేనారున్ ముత్తుస్వామి (6), సిమోన్ హార్పర్ (14 నాటౌట్), ప్రేనేలన్ సుబ్రాయెన్ (8), కగిసో రబాడ (0) నిరాశపర్చారు. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు తీసిన నోమన్ అలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్ ఈ నెల 28 నుంచి రావల్పిండిలో జరుగుతుంది.