పాలమూరు  ప్రాజెక్టులపై స్పెషల్ డ్రైవ్..2028 నాటికి పాలమూరు- రంగారెడ్డి పూర్తి

పాలమూరు  ప్రాజెక్టులపై స్పెషల్ డ్రైవ్..2028 నాటికి పాలమూరు- రంగారెడ్డి పూర్తి
  • యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేస్తం: మంత్రి ఉత్తమ్​
  • వచ్చే ఏడాది మార్చికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్​సాగర్ ​కంప్లీట్​
  • ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై మంత్రులు, ఎమ్మెల్యేలతో రివ్యూ

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు స్పెషల్​ డ్రైవ్​ చేపడతామని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. రాబోయే రెండున్నరేండ్లలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 2028 నాటికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్​సాగర్​ ప్రాజెక్టులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని ఇరిగేషన్​ ప్రాజెక్టులపై ఆదివారం జలసౌధలో ఆయన ఆ జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రివ్యూ చేశారు. 


 రాష్ట్రానికి దక్కాల్సిన జలాల్లో చుక్క కూడా వదులుకోబోమని ఉత్తమ్​ స్పష్టం చేశారు. కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులను కేటాయిస్తున్నామని చెప్పారు. కల్వకుర్తికి రూ.909 కోట్లు, నెట్టెంపాడుకు రూ.252 కోట్లు, భీమాకు రూ.200 కోట్లు, కోయిల్​సాగర్​కు రూ.185 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. ఆయా ప్రాజెక్టులను మిషన్​ మోడ్​లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం భూసేకరణను ప్రాధాన్యంగా తీసుకున్నదని, పరిహారం విషయంపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. జూన్​ 2 నాటికి కీలకమైన ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారని, అందుకు రూ.5 వేల కోట్లు కూడా కేటాయిస్తున్నారని తెలిపారు. 

పాలమూరు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం

బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్​ అన్నారు. పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్​ ప్రాజెక్ట్​ సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. సోర్సును మార్చడం వల్ల లిఫ్టింగ్​ కాస్ట్​ భారీగా పెరిగిందని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి కూడా అలాగే తయారైందన్నారు. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద సోర్సును మేడిగడ్డకు మార్చి కాళేశ్వరంగా రీడిజైన్​ చేశారని, ఫలితంగా దాని లిఫ్టింగ్​ కాస్ట్​ కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యపరంగా స్పెషల్​ డ్రైవ్​ చేపట్టి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు.

కృష్ణా బేసిన్​లోని రైతులకు నీళ్లిచ్చి తీరుతామని, మంచి పంటలు పండేలా చూస్తామని, ఆర్థిక మద్దతును అందిస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామంటూ గత ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారని, ప్రాజెక్టుకు రూ.35,200 కోట్లకు అప్రూవల్స్​ ఇచ్చారని, ఆ తర్వాత దాని అంచనా వ్యయం రూ.80 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. అందులో కేవలం రూ.27 వేల కోట్ల పనులే బీఆర్ఎస్​ పూర్తి చేసిందన్నారు.

జూరాల పూడిక   

జూరాల ప్రాజెక్టు పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. ప్రాజెక్ట్​ నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీల నుంచి 9 టీఎంసీలకు పడిపోయిందన్నారు. కృష్ణా జలాల్లో వాటా హక్కులను పూర్తిగా వాడుకుంటున్నామని, ఒక్క చుక్కను కూడా వదులుకోవట్లేదని స్పష్టం చేశారు.

కృష్ణా బేసిన్​లో.. కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ ఆయకట్టులో పంటలు వేశారని, ఎక్కువ దిగుబడులు వచ్చాయని చెప్పారు. గత ఖరీఫ్​ సీజన్​లో 148.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.  రివ్యూలో మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, ఇరిగేషన్​ శాఖ అధికారులు పాల్గొన్నారు.