- ప్రత్యామ్నాయ పంటల మార్కెటింగ్పై నిర్లక్ష్యం
- ఎకరానికి 10 వేలు నష్టపోతున్నామంటూ ఆవేదన
- మార్కెట్ను కంట్రోల్ చేస్తున్న ఆయిల్ మిల్లర్లు
నిజామాబాద్, వెలుగు:ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో వరికి బదులు పల్లి సాగుచేసిన రైతులు పంటకు గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారు. పంట మార్చుకోవాలని ప్రచారం చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలకు మార్కెటింగ్వసతులు కల్పించలేకపోయింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆయిల్ మిల్లర్స్ సిండికేట్ గా మారి రేట్లు కంట్రోల్ చేస్తున్నారు. ఆరు నెలల పాటు పంటను కంటికిరెప్పలా కాపాడుకున్నా.. కనీసం పెట్టుబడి కూడా తిరిగిరాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
యాసంగి సీజన్ లో వరి సాగు చేయొద్దని ప్రభుత్వం ప్రకటించడంతో నిజామాబాద్ జిల్లాఆర్మూర్ఏరియాలో 2 వేల ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశారు.మాక్లూర్ మండలంలోని కొత్తపల్లి, మెట్ పల్లి , గొట్టిముక్కల, మాణిక్భండార్, ఢీకంపల్లి, కల్లెడి, మదనపల్లి, గుత్ప, రాంచంద్రపల్లి గ్రామాల్లో రైతులు దాదాపు వెయ్యి ఎకరాల్లో పల్లి పంట వేశారు. నూనెగింజలకు డిమాండ్ ఉంటుందని రైతు సదస్సుల్లో వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో ఈ పంటవైపు మొగ్గు చూపారు. విత్తనాలకు ఎకరానికి రూ. 7 వేలు ఖర్చయ్యాయి. ట్రాక్టర్, కూలీలు, ఎరువులు అన్ని కలిపి ఒక ఎకరంలో పల్లి సాగు చేసేందుకు రూ. 35 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ సారి అకాల వర్షాలతో పంటలకు తెగుళ్లు సోకడం దిగుబడి మీద ప్రభావం చూపింది. ఎకరానికి దాదాపు 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిఉండగా ఈసారి 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. జిల్లాలో పల్లి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు లేవు. దీంతో ఆయిల్ మిల్లుల యజమానులు చెప్పిందే ఫైనల్ అన్నట్టు పరిస్థితి మారింది. కొందరు రైతులు సరుకును మహారాష్ట్రలోని ధర్మాబాద్కు తరలిస్తున్నారు. అక్కడ కూడా నిజామాబాద్కు చెందిన ఆయిల్మిల్లర్ల మనుషులు చక్రం తిప్పుతున్నారు. అక్కడికి తీసుకెళ్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా గిట్టుబాటు కావడంలేదని రైతులు వాపోతున్నారు. లోకల్ మార్కెట్లో ఆయిల్ మిల్లుల యజమానులు క్వింటాలు పల్లి ధర రూ. 3,500లకు కొంటున్నారు. క్వాలిటీ బాగా లేదని సాకులు చెప్తూ రేటును తగ్గించేశారు. ఈ లెక్కన ఎకరానికి రైతులకు రూ. 24,500లకు మించి రావడంలేదు. పల్లి రైతులు ఎకరానికి రూ. 10 వేలు నష్టపోతున్నారు. మార్కెట్లో సిండికేట్ను, దళారులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్నందున క్వింటాలుకు రూ. 8 వేల రేటు దక్కేలా చూడాలని కోరుతున్నారు.
