20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎంపీడీవో

20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎంపీడీవో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ ఎంపీడీవో ఆల్బర్ట్ రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డారు. కాంట్రాక్టర్ కు శాంక్షన్ అయిన బిల్లు డబ్బు చెల్లించేందుకు ఆయన లంచం డిమాండ్ చేశారు. ఉగాది పండుగ రోజు 20 వేలు లంచం తీసుకున్న మరో 20 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామంలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. రామలింగయ్య అనే  క్లాస్-5 కాంట్రాక్టర్  పనులు దక్కించుకుని చేస్తున్నాడు. మొదటి విడుత పనులు కంప్లీట్ చేసి బిల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత రెండో విడుత పనులు కంప్లీట్ చేసి బిల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గత మార్చిలో బిల్లు శాంక్షన్ అయిన విషయం తెలుసుకుని పంచాయతీ కార్యదర్శి శ్వేతను కలిశాడు. ఎంపీడీవో తనకు చెప్పలేదని.. ఆయన చెబితే ఇస్తానని చెప్పడంతో బాధితుడు రామలింగయ్య ఎంపీడీవో ఆల్బర్ట్ ను కలిశాడు. బిల్లు విడుదల కోసం ఉగాది పండుగకు ముందు 20వేల రూపాయలు ఇచ్చాడు. సరిపోదని మరో 20 వేల రూపాయలు కావాలని డిమాండ్ చేయడంతో బాధితుడు రామలింగియ్య ఏసీబీ వారిని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ఇచ్చిన 20వేల రూపాయలు తీసుకుని శీల్డు కవర్ లో పెట్టుకుని శుక్రవారం మధ్యాహ్నం ఎంపీడీవో ఆఫీసుకు ఇచ్చి లంచం డబ్బు ఎంపీడీవో ఆల్బర్టు కు ఇచ్చి బయటకు వచ్చాడు. వెంటనే ఏసీబీ డిఎస్పీ మధుసూదనరావు వారి సిబ్బంది కార్యాలయంలోకి వెళ్లి ఆల్బర్ట్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కెమికల్ టెస్టు పాజిటివ్ గా వచ్చిందని.. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని అరెస్టు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ మధుసూధనరావు తెలిపారు.