కాంగ్రెస్ వస్తేనే బంగారు తెలంగాణ : భరత్

కాంగ్రెస్ వస్తేనే బంగారు తెలంగాణ  : భరత్

చేవెళ్ల, వెలుగు:  తొమ్మిదేన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో జనం ఆకాంక్షలు నెరవేరలేదని.. కేసీఆర్ బంగారు తెలంగాణ నినాదం ఓ బూటకమని చేవెళ్ల సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం భరత్ మండిపడ్డారు. గురువారం మొయినాబాద్ మండలం చందానగర్, జీవన్ గూడ, ఎన్కేపల్లి, అప్పోగూడ గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భీం భరత్ మాట్లాడుతూ..   కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.  

ఏ ప్రయోజనాల కోసం జనం ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాడారో అవి నెరవేరలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. అనంతరం బీఆర్ఎస్​కు చెందిన పలువురు నాయకులు భీం భరత్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. వీరిలో ఎంకెపల్లి గ్రామానికి చెందిన ఉద్యమకారుడు న్యాలట మహిపాల్, బీఆర్ఎస్ నాయకులు తిరుపతిరెడ్డి, సాయిరెడ్డి, అజయ్, చందానగర్ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఇబ్రహీం, కార్యర్తలు ఉన్నారు. కార్యక్రమంలో మొయినాబాద్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మలి మణెయ్య, పీసీసీ మెంబర్ షాబాద్ దర్శన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామస్వామి, ఏఐటీయూసీ నేతలు పాల్గొన్నారు.