- ముగిసిన మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ
- బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యపై నేడు క్లారిటీ
- అభ్యర్థులకు తెలుగు వర్ణమాల ప్రకారం గుర్తుల కేటాయింపు
- మూడో విడత నామినేషన్లు షురూ
హైదరాబాద్, వెలుగు: మొదటి విడత పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. తర్వాత అధికారులు పోటీలో నిలిచే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల తుదిజాబితా ఖరారు చేశారు. బుధవారం సాయంత్రం వరకు అందిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్జిల్లాలో అత్యధికంగా 30 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు.
ఖమ్మం జిల్లాలో19, జోగులాంబ గద్వాల 15, మెదక్ 15, నాగర్కర్నూల్ 14, భద్రాద్రి కొత్తగూడెం 14, యాదాద్రి 14, నారాయణపేట 13, కామారెడ్డి 11, జనగామ 10, మహబూబ్నగర్ 9 , మహబూబాబాద్ 8, ములుగు 7, మంచిర్యాల జిల్లాలోని 6 గ్రామాల్లో సర్పంచ్స్థానాలు ఏకగ్రీవమైనట్లు తెలిసింది. ఆయా చోట్ల సర్పంచ్స్థానాలకు ఒకే ఒక్క నామినేషన్ రాగా.. విజేతలను అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.
సర్పంచ్లు ఏకగ్రీవమైన అనేక గ్రామాల్లో వార్డుమెంబర్లు కూడా ఏకగ్రీవం కావడం విశేషం. ఈ లెక్కన మొదటి విడత ఎన్నికలు జరగనున్న 4,236 గ్రామ పంచాయతీల్లో సుమారు 400 దాకా సర్పంచ్స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. కాగా, అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తివివరాలు అందలేదు. అర్ధరాత్రి వరకు జిల్లాలవారీగా బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాలు అందుతూనే ఉన్నాయి. వీటిపై గురువారం క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎస్ఈసీ అధికారులు చెప్తున్నారు.
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు..
బరిలో నిలిచిన అభ్యర్థులకు ఆయా జిల్లాల్లో గుర్తులు కేటాయించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతుండడంతో అభ్యర్థులకు వారి పేర్లలోని తెలుగు అక్షర క్రమం ఆధారంగా స్టేట్ఎలక్షన్ కమిషన్ సూచించిన గుర్తులను కేటాయిస్తున్నారు.
అభ్యర్థులు నామినేషన్ పత్రంలో తమ పేరును ఏ విధంగా పేర్కొంటే, ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే వారికి బ్యాలెట్ పేపర్లో స్థానం కల్పిస్తున్నారు. కొందరు అభ్యర్థులు తమ ఇంటిపేరును ముందుగా, మరికొందరు తమ పేరును ముందుగా పేర్కొనడం ద్వారా కొంత సమస్య తలెత్తింది.
సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ గుర్తును అందుబాటులోకి తీసుకొచ్చారు. గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తైన తర్వాత పోలింగ్కు అవసరమైన బ్యాలెట్ పత్రాలను ముద్రించి.. ఆయా గ్రామాలకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలివిడత ఎన్నికలు11న జరగనుండగా.. అదేరోజు విజేతలను ప్రకటించనున్నారు.
మూడో విడత నామినేషన్లు షురూ
మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. జిల్లాలవారీగా ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ వెలువరించి.. అనంతరం ఓటరు జాబితా ప్రకటించారు. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టారు. తొలిరోజు నామినేషన్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. కాగా, అన్ని జిల్లాల నుంచి నామినేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు రాలేదు. దీంతో వీటి వివరాలను ఎన్నికల ఆఫీసర్లు ప్రకటించలేదు.
ఈ విడతలో 4,159 పంచాయతీలకు, 36,452 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నామినేషన్లకు ఆఖరు గడువు. 9న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదేరోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అధికారులు వెల్లడిస్తారు. అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు. 17న పోలింగ్ఉంటుంది.
