- జనగామ జిల్లాలో 280 జీపీలు,
- భూపాలపల్లి జిల్లాలో 248 జీపీ స్థానాలకు ఖరారు
జనగామ/ జయశంకర్భూపాలపల్లి, వెలుగు : గ్రామ పంచాయతీ రిజర్వేషన్లను అధికారులు ఆదివారం ఖరారు చేశారు. సర్పంచ్ల రిజర్వేషన్లను ఆర్డీవోలు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఫైనల్ చేశారు. జనగామ జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా, 2534 వార్డులు ఉన్నాయి. కాగా, సర్పంచ్ స్థానాలు 65 జనరల్, 58 జనరల్ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. 25 బీసీ జనరల్, 20 బీసీ మహిళకు కేటాయించారు. 31 ఎస్సీ జనరల్, 23 ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. 23 ఎస్టీ జనరల్, 17 ఎస్టీ మహిళలకు కేటాయించారు.
ఇదిలా ఉండగా జిల్లాలో ఎస్టీ జనాభా వంద శాతం ఉన్న గ్రామ పంచాయతీలు 39 ఉండగా, వాటిని ఎస్టీలకే కేటాయించారు. అలాగే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని 248 జీపీలకు రిజర్వేషన్లను ఆఫీసర్లు ఫైనల్ చేసి గెజిట్ విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 2102 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 302,147 మంది ఓటర్లు ఉన్నారు. వందశాతం ఎస్టీలున్న గ్రామాల్లో మహిళకు రెండు స్థానాల్లో, పురుషులకు 5 స్థానాల్లో రిజర్వు చేశారు.
ఎస్టీ కేటగిరిలో 9 జీపీల్లో మహిళలకు, 12 జీపీల్లో పురుషులకు, బీసీలకు 21 జీపీల్లో మహిళలకు, 25 జీపీల్లో పురుషులకు, జనరల్ కేటగిరిలో 59 జీపీల్లో మహిళలకు, 64 జీపీల్లో పురుషులకు రిజర్వు చేశారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 114 జీపీల్లో మహిళలకు రిజర్వు చేయగా, 134 జీపీల్లో పురుషులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
