తన సినిమాలకు ప్రశంసలే కాదు డబ్బులు కూడా వస్తాయని ‘పాపం ప్రతాప్’ చిత్రం నిరూపిస్తుందని అన్నాడు హీరో తిరువీర్. తను లీడ్ రోల్లో ఎస్పీ దుర్గ నరేష్ దర్శకత్వంలో ఈటీవీ విన్ సహకారంతో రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 17న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో తిరువీర్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చేస్తున్నప్పుడు మా నాన్న గుర్తొచ్చారు. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసే సినిమా ఇది. టీజర్ను మించిన ఫన్ ఉంటుంది. ఈటీవీ విన్లో నా లైనప్ ఉండటం ధైర్యాన్నిస్తోంది’ అని అన్నాడు. డైరెక్టర్ దుర్గ నరేష్ మాట్లాడుతూ ‘కమర్షియల్ బడ్జెట్లో పడి, ఒరిజినల్ సినిమాలను, కథలను వదిలేస్తున్న ఈ టైమ్లో నేను మళ్లీ అలాంటి ప్రపంచాన్ని తీసుకురావాలని ప్రయత్నించాను. ఈ సినిమా పక్కా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నా’ అని అన్నాడు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ సినిమాతో థియేటర్లలో నవ్వులు గ్యారెంటీ. ఈ మూవీ బాగా ఆడితే ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తాం. మా సంస్థ నుంచి కొత్త వాళ్లనే ఎంకరేజ్ చేస్తాం’ అని అన్నారు. యాక్టర్ ప్రసాద్ బెహరా, ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ పాల్గొన్నారు.
