కూతురి గ్రాడ్యుయేషన్ వేడుకకు వెళ్తూ అనంతలోకాలకు: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరో విషాద గాధ

కూతురి గ్రాడ్యుయేషన్ వేడుకకు వెళ్తూ అనంతలోకాలకు: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరో విషాద గాధ

గాంధీనగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర వేదనను మిగిల్చింది. విమాన ప్రమాదంలో మరణించిన ఒక్కక్కొరిది ఒక్కో విషాద గాధ. ఎవర్ని కదిలించిన కన్నీళ్లే వస్తున్నాయి. ఎన్నో ఆశలతో ప్లయిట్ ఎక్కి.. నిమిషాల్లోనే మాడి మసైపోయారు 241 మంది. ఈ ప్రమాదానికి సంబంధించి  గంట గంటకి ఒక కొత్త విషాద ఘటన వెలుగులోకి వస్తుంది. తాజాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరో కన్నీళ్లు తెప్పించే ఘటన బయటపడింది. లండన్‎లో కూతురి గ్రాడ్యుయేషన్ వేడుకకు వెళ్తూ.. ఊహించని విధంగా విమాన ప్రమాదంలో మృతి చెందారు తల్లిదండ్రులు. దీంతో కూతురి గ్రాడ్యుయేషన్ వేడుక సంబురం కాస్తా ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 

వివరాల ప్రకారం.. గుజరాత్‎లోని ఆనంద్ జిల్లా వాసద్‌కు చెందిన రజనీకాంత్ పటేల్ (58) కూతురు ధ్వని పటేల్ లండన్‎లోని మిడిల్‌సెక్స్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతోంది. ధ్వని పటేల్ ఎంబీఏ కోర్సు పూర్తి కావడంతో 2025, జూన్ 23న వర్శిటీలో గ్రాడ్యుయేషన్ వేడుక నిర్వహించనున్నారు. కూతురి గ్రాడ్యుయేట్ పట్టా అందుకోవడంలో కళ్లారా చూడాలని రజనీకాంత్ పటేల్, ఆయన  భార్య దివ్య పటేల్, అతని వదిన హేమాంగిని పటేల్ (58) లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 

ఇందులో భాగంగానే 2025, జూన్ 12న అహ్మదాబాద్‎లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అహ్మదాబాద్ నుంచి లండన్‎లోని గాట్విక్ వెళ్లనున్న ఎయిర్ ఇండియా AI171 విమానం ఎక్కారు. కూతురు గ్రాడ్యుయేషన్ వేడుకకు వెళ్తున్నామన్న వాళ్ల సంతోషం నిమిషాల్లోనే ఆవిరైపోయింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే విమానం కుప్పకూలింది. చెట్టును ఢీకొని ఓ కాలేజ్ భవనంపై కుప్పకూలడంతో ఒక్కసారిగా విమానం బ్లాస్ట్ అయ్యింది. పేలుడు ధాటికి విమానంలోని 241 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. 

ఈ దుర్ఘటనలో కూతురి స్నాతకోత్స వేడుకకు వెళ్తున్న రజినీకాంత్ పటేల్, ఆయన భార్య దివ్య పటేల్, వదిన హేమాంగిని పటేల్ ముగ్గురు మాడి మసైపోయారు. తన గ్రాడ్యుయేషన్ వేడుక కోసం వస్తూ తల్లిదండ్రులు విమాన ప్రమాదంలో మరణించారన్న వార్త తెలియగానే  ధ్వని పటేల్ గుండె బద్దలైంది. ధ్వని జీవితంలో గ్రాడ్యుయేషన్ వేడుక ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానన్న ఆనందం ఆవిరై.. తల్లిదండ్రుల మృతితో ధ్వని జీవతంలో చీకట్లు అలుముకున్నాయి.