
ప్రస్తుతం ఏఐ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అన్ని రంగాల్లో ఏఐ దూసుకుపోతోంది. ఫోటోలు,వీడియోలతో మాయా ప్రపంచాన్ని చూపిస్తోంది. ఎన్నో అద్భుతాలు చేస్తోంది. ఇదే ఏఐ..తల్లిదండ్రులు లేని ఓ కూతూరి కళ్లల్లో ఆనందాన్ని నింపింది. చనిపోయిన అమ్మానాన్నలు ఏఐ రూపంలో స్వర్గం నుంచి దిగి వచ్చి కూతురిని ఆశీర్వదించింది.
కరీంనగర్ కు మారుతి నగర్ కు చెందిన నిమ్మల రామచంద్రం సుమలత దంపతులు అనారోగ్యంతో మృతి చెందారు. రామ చంద్రం 26 సెప్టెంబర్ 2018 లో చనిపోగా.. రెండేళ్లకే సుమలత 2020 ఫిబ్రవరి 2న కన్ను మూసింది. వీళ్లకు అప్పటికే ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు పిల్లల ఆలనా పాలన వారి నానమ్మ, తాతయ్యలు చూస్తున్నారు. అమ్మ నాన్నలు చనిపోయిన సమయంలో ఇద్దరు చాలా చిన్నవారు. అమ్మానాన్న ప్రేమకు దూరం అయ్యారు. వీరిలో కొడుకు మణికి ప్రస్తుతం 14 ఏళ్ళు, కూతురు మనస్వికు 13 సంవత్సరాల వయస్సు.
అయితే జూన్ 9న చిన్నారి మనస్విక ఓణి ఫంక్షన్ ను కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హల్ లో చాలా గ్రాండ్ గా చేశారు తాతయ్య నానమ్మ. చిన్నతనంలోనే అమ్మానాన్నల ప్రేమకు దూరమైన ఆ చిన్నారికి వారి కుటుంబ సభ్యులు సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. మనస్విక నానమ్మ, తాతయ్య, బాబాయ్ లు కలిసి AI సాయంతో స్వర్గం నుంచి తల్లితండ్రులు ఆ ఫంక్షన్ కు వచ్చినట్లు, బాలికను హత్తుకున్నట్లు, వారితో ఫోటో దిగినట్లు LED స్క్రీన్ మీద ప్రదర్శించారు.
చనిపోయిన అమ్మానాన్నలను AI ద్వారా ఫంక్షన్ లో స్క్రీన్ పై వీడియో చూసి ఆ బాలిక కన్నీరు మున్నీరయ్యింది. చిన్నారే కాదు ఆ ఫంక్షన్ కు హాజరైన వారందరు కూడా ఆ వీడియో చూసి కంటతడి పెట్టుకున్నారు. తల్లి తండ్రుల వీడియో చూస్తూన్నంత సేపు మనస్వికకు దుఃఖంతో కన్నీళ్లు ఆగలేదు. పిల్లల కోసం ప్లాన్ చేసిన వారి నానమ్మ, తాతయ్య బాబాయ్ లను ఫంక్షన్ కు వచ్చిన పలువురు అభినందించారు. ఆ చిన్నారి జీవితంలో ముఖ్యమైన వేడుకకు తల్లిదండ్రులు లేని లోటును తీర్చిన ఏఐ టెక్నాలజీని అందరూ మెచ్చుకున్నారు.