
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించడంలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి శీతాకాల సమావేశాలను వాయిదావేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల అన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. శీతాకాల సమావేశాలకు బదులు జనవరిలో నేరుగా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటుచేయాలని పలు పార్టీలు సూచించాయని ఆయన అన్నారు. అన్ని పార్టీల నాయకులతో తాను చర్చలు జరిపానని, కోవిడ్ కారణంగా సెషన్ను నిర్వహించకూడదనే ఏకాభిప్రాయం ఉందని జోషి బదులిచ్చారు. ప్రస్తుతం పార్లమెంటులో 785 మంది సభ్యులలో 200 మందికి పైగా 65 ఏళ్లు పైబడిన వారున్నారని.. వారందరికీ కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆయన అన్నారు.
రైతులు ఢిల్లీలో చేస్తున్న నిరసనలకు ప్రధానమైన కారణమైన కొత్త వ్యవసాయ చట్టాల గురించి చర్చించడానికి పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి కోరారు. ఆ విషయంపై స్పందించిన జోషి.. తన లేఖలో ఈ విషయాన్ని ధృవీకరించారు. కొత్త వ్యవసాయ చట్టాలను సవరించాల్సిన అవసరముందని ఎంపీ రంజన్ చౌదరి నొక్కి చెప్పారు.
ప్రతి ఆరు నెలలకోసారి పార్లమెంటు తప్పకుండా నిర్వహించాలని రాజ్యాంగం చెబుతోంది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం సమావేశాలు నిర్వహించడం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రకటన ఉంటుంది. దానికంటే ముందు జనవరి చివరి వారంలో బడ్జెట్ సెషన్ ఉంటుంది.
చాలా మంది ఎంపీలు సెప్టెంబరులో కోవిడ్ బారినపడటంతో పార్లమెంటు మాన్సూన్ సమావేశాల కాలాన్ని తగ్గించారు. మాన్సూన్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు నిర్వహించిన పరీక్షల్లో లోక్సభకు చెందిన 17 మంది సభ్యులు, రాజ్యసభకు చెందిన ఎనిమిది మందికి కరోనా పాజిటివ్గా తేలింది. చాలామంది ఎంపీలకు మొదట నెగిటివ్ వచ్చింది. కానీ, సమావేశాలు ప్రారంభమైన తర్వాత పాజిటివ్గా తేలింది. సామాజిక దూరం, ప్రత్యేక మార్పులు మరియు సాధారణ RT-PCR పరీక్షల వంటి మందుస్తు చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి చెందడంతో.. సమావేశాల కాలాన్ని తగ్గించారు.
For More News..