ఖాళీ అవుతున్న కారు..కామారెడ్డిలో బీఆర్ఎస్​ను వీడుతున్న పార్టీ లీడర్లు

ఖాళీ అవుతున్న కారు..కామారెడ్డిలో బీఆర్ఎస్​ను వీడుతున్న పార్టీ లీడర్లు
  • కేసీఆర్ ​పోటీ చేసిన కామారెడ్డిలోనే అధికం
  • కాంగ్రెస్​లో ముమ్మరంగా చేరికలు

కామారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి లీడర్లు ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. దీంతో నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్​ కోల్పోతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్​అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కామారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా పార్టీ మారుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రారంభం నుంచే చేరికలు షురూ కాగా కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి  రావడంతో మరింత ఎక్కువయ్యాయి. గులాబీ పార్టీకి కంచుకోట అయిన గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ కేసీఆర్​పోటీ చేశారు. 

ఎన్నికల టైమ్​లో కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్​ఇన్​చార్జిగా ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్ ​వ్యవహరించారు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసి, కేసీఆర్​ను గెలిపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, లీడర్లు, కౌన్సిలర్లు బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. మున్సిపల్ వైస్ చైర్​పర్సన్​ ఇందుప్రియ, కౌన్సిలర్లు, భిక్కనూరు ఎంపీపీ గాల్​రెడ్డి, దోమకొండ జడ్పీటీసీ తిర్మల్​గౌడ్​తో పాటు పలువురు బీఆర్ఎస్​కు గుడ్​బై చెప్పారు. 

స్వయంగా పార్టీ అధినేత పోటీ చేసినా కామారెడ్డిలో పార్టీ విజయం సాధించకపోవడంతో నారాజ్​గా ఉన్న క్యాడర్​హస్తం గూటికి చేరుతున్నారు. కామారెడ్డి టౌన్​తో పాటు, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండలాల్లో వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల మాచారెడ్డి సింగిల్ విండోకు చెందిన 8 మంది డైరెక్టర్లు కూడా కాంగ్రెస్ ​కండువా కప్పుకున్నారు. పార్లమెంట్​ఎన్నికల నేపథ్యంలో పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్​ సైతం చేరికలను ప్రోత్సహిస్తోంది.

మున్సిపాలిటీపై పట్టుబిగిస్తున్న హస్తం

కామారెడ్డి మున్సిపాలిటీపై హస్తం పట్టు బిగిస్తోంది. టౌన్​కు చెందిన చాలామంది బీఆర్ఎస్ ​లీడర్లతో పాటు ఆ పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్లు హస్తం గూటికి చేరుతున్నారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 23 చోట్ల బీఆర్ఎస్, 8 స్థానాల్లో బీజేపీ, 12 ప్లేస్​లలో కాంగ్రెస్, ఆరు చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఆరుగురి ఇండిపెండెట్లు సైతం బీఆర్ఎస్​లో చేరగా ఆ పార్టీ చైర్​పర్సన్, వైస్​చైర్​పర్సన్ ​పదవులను దక్కించుకుంది. 

ALSO READ : ఎస్టీపీపీ విస్తరణపై ఆశలు.. 800 మెగావాట్ల మూడో యూనిట్​కు త్వరలోనే టెండర్లు

ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల టైమ్​లో కాంగ్రెస్​కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్​లోకి వెళ్లారు. మున్సిపాలిటీలో ఆ పార్టీ తిరుగులేకుండా హవా కొనసాగించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సమీకరణలు మారుతున్నాయి. పార్టీని వీడిన కాంగ్రెస్ ​కౌన్సిలర్లు ఘర్​వాపసీ​ కాగా, బీఆర్ఎస్ ​కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్​లోకి క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్​ బలం 24కు చేరింది. చైర్మన్​పై అవిశ్వాసం పెట్టాలంటే 36 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. మరి కొందరు కౌన్సిలర్లు పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని హస్తం లీడర్లు పేర్కొంటున్నారు. 

క్యాడర్​లో అయోమయం

అసెంబ్లీ ఎన్నికల టైమ్​లోనే బీఆర్ఎస్​లో విభేదాలు బయటపడ్డాయి. కేసీఆర్​ ఓటమి తర్వాత కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​చార్జి ఎవరనే విషయమై అధిష్టానం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఓటమిపై కూడా  రివ్యూ చేయలేదని లీడర్లు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో తమ భవిష్యత్తు ఏమిటని క్యాడర్​ అయోమయంలో ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు గులాబీ లీడర్లు కాంగ్రెస్​లో చేరారు. మరికొందరు లీడర్లు కొద్దిరోజుల కింద మాజీ మంత్రి హరీశ్​రావును కలిసి నియోజకవర్గ ఇన్​చార్జిపై చర్చించినట్లు తెలుస్తోంది.