
హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డిని మళ్లీ కేబినెట్లోకి తీసుకుంటారని బీఆర్ఎస్లో జోరుగా ప్రచారం సాగుతున్నది. సోమవారం పార్టీ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు కేసీఆర్బదులిస్తూ.. ‘‘పట్నం మహేందర్ రెడ్డికి ఏం ఇస్తమో రెండు రోజుల్లో తెలుస్తది” అని సమాధానమివ్వడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నది. బుధవారం రాజ్భవన్లో మహేందర్రెడ్డి మంత్రిగా ప్రమాణం చేస్తారని, దానిపై మంగళవారం అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
2018 ఎన్నికల్లో తాండూరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహేందర్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత రోహిత్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. మహేందర్రెడ్డికి రంగారెడ్డి స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తాండూరు టికెట్ రాకుంటే మహేందర్రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. దీంతో ఆయనను మంత్రి కేటీఆర్ పిలిపించుకొని మాట్లాడారు. సోమవారం ఉదయం మహేందర్రెడ్డిని కేసీఆర్ ప్రగతి భవన్కు పిలిపించారు. రెండు రోజుల్లో మంచి నిర్ణయం ఉంటుందని, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ప్రగతి భవన్ నుంచి తన కాన్వాయ్లోనే ఆయనను వెంట బెట్టుకొని తెలంగాణ భవన్కు కేసీఆర్ వచ్చారు. ఈటల రాజేందర్ను తప్పించిన నాటి నుంచి ఖాళీగా ఉన్న స్థానంలో మహేందర్రెడ్డిని మంత్రిగా చేస్తారని తెలుస్తున్నది.