మా వాదన వినకుండా ఎలాంటి ఆర్డర్ ఇవ్వొద్దు

మా వాదన వినకుండా ఎలాంటి ఆర్డర్ ఇవ్వొద్దు
  •     సుప్రీంకు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి 

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు ఆర్డర్ పై తమ వాదన వినకుండా ఎలాంటి ఆర్డర్ ఇవ్వొద్దని ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. దండె విఠల్ ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన పిటిషన్ లో కోరారు.

ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నిక చెల్లదని ఈ నెల 3న హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అలాగే, విఠల్ కు రూ.50 వేల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నాలుగు వారాల టైం ఇచ్చింది. 2021లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా విఠల్ నామినేషన్ వేశారు. అలాగే, టికెట్ ఆశించి భంగపడ్డ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. తాను నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోయినా.. తన సంతకాన్ని దండె విఠల్ ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. సంతకం ఫోర్జరీ జరిగిందన్న సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది. అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని దండె విఠల్ ఇప్పటికే వెల్లడించారు. అప్పీల్ చేసుకునేందుకు నాలుగు వారాల టైం ఉందని, ఆ లోపు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పత్తిరెడ్డి ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.