తెలుగు పేపర్‌ని నడుపుతూ తెలుగునే చంపేస్తావా?

తెలుగు పేపర్‌ని నడుపుతూ తెలుగునే చంపేస్తావా?

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతమే చేస్తున్నాయి. తెలుగు రాష్ర్టంలో తెలుగును తీసివేయడమేంటని ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును రద్దుచేసి, ఇంగ్లీష్‌ను ప్రవేశపెట్టడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రశ్నించారు. తాజాగా ఆయన మరోసారి ట్విట్టర్ వేదికగా ఇదే విషయంపై ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు భాషని ఎవరూ వద్దని చెప్పటం లేదని ఆయన అన్నారు. మాతృ భాష తెలుగుని మృత భాషగా కాకుండా ఏం చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు ‘జగన్ రెడ్డి గారు’ చెప్పాలని ఆయన అన్నారు. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. మాతృ భాషని, మృత భాషగా మార్చకండంటూ ఆయన కోరారు. తెలుగు రాష్ట్రానికి సీఎంగా ఉండి, రాష్ట్రాన్నిఏలుతూ మరియు తెలుగు పేపర్‌ని నడుపుతూ తెలుగుని చంపేసే ఆలోచన భస్మాసుర తత్వాన్ని సూచిస్తుందని ఆయన మండిపడ్డారు. ‘మా తెలుగు తల్లి’ అని పాడాల్సిన మీరు ‘తెలుగు భాష తల్లినే’ చంపేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.