నాకు ప్రాణహాని ఉంది.. చంపేందుకు సుఫారీ గ్యాంగ్ లను దింపారు: పవన్ కళ్యాణ్

నాకు ప్రాణహాని ఉంది.. చంపేందుకు సుఫారీ గ్యాంగ్ లను దింపారు: పవన్ కళ్యాణ్

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యవర్గ సమావేశంలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, తనని చంపేందుకు ప్రత్యేక సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయని బాంబ్ పేల్చారు. తాను బ్రతికి ఉండాలంటే సెక్యూరిటీ తప్పనిసరి అని.. అందుకే సెక్యూరిటీ పెట్టుకున్నానని చెప్పారు. తన వల్ల వాళ్లకు ఇబ్బంది ఉన్నప్పుడు.. తనని బ్రతకనిస్తారా? అని అన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాకపోతే.. తనని చంపేద్దామని అనుకున్నారని కుండబద్దలు కొట్టారు. తానేమీ కల్పించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, అలాంటి రికార్డ్స్ తన వద్ద ఉన్నాయని.. ఇంటెలిజెన్స్ వర్గాల వారు తనకు రిపోర్ట్స్ పంపించారని షాకిచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని 34 సీట్లలో.. వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని పిలుపునిచ్చారు.

అధికారం కోల్పోతున్నామనే భావన ఏదైనా చేయిస్తుందని తెలిపారు. తనను చంపేందుకు కూడా సుపారీ గ్యాంగులను రంగంలోకి దించారని తనకు సమాచారం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అధికారం కాపాడుకునేందుకు నాయకులు ఎంతకైనా తెగిస్తారని, క్రూరంగా ఆలోచిస్తారని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నాయకులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు .

ప్రస్తుతం జనసేన బలంగా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలో నుంచి దించే దిశలో ప్రయాణం చేస్తోందని తెలిపారు. ఇలాంటి సమయంలోనే నాయకులు ఏమైనా చేసేందుకు సిద్ధపడుతారని అన్నారు. అధికారం పోతుందనే భావన వారితో ఏమైనా చేయిస్తుందని తెలిపారు. క్రూరంగా మార్చే అవకాశం ఉందని చెప్పారు. 

తనను భయపెడితే మరింతగా రాటుదేలుతానని జనసేన అధినేత అన్నారు. గతంలో కాకినాడ శాసనసభ్యుడి అనుచరులు తమ పార్టీ కార్యకర్తలు, మహిళలపై దాడి చేశారనే విషయం తనకు గుర్తు ఉందన్నారు. దానిని మర్చిపోలేదని అన్నారు. అప్పట్లో తమ పార్టీకి బలమైన కార్యాచరణ లేదని, అందుకే వెనకడుగు వేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే  సమాధానం చెప్పే రోజు తప్పకుండా వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.