![చంద్రబాబును పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్](https://static.v6velugu.com/uploads/2023/11/pawan-kalyan-to-meet--chandrababu-at-jubilee-hills-babu-house_pdjzE5Y8HF.jpg)
టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు ( నవంబర్ 4) పరామర్శించారు. చంద్రబాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అటు చంద్రబాబు కుటుంబ సభ్యులను సైతం పరామర్శించారు.
రాజమండ్రి జైలులో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలు జీవితాన్ని అనుభవించారు. అనారోగ్య సమస్యల దృష్ట్యా చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అనారోగ్య సమస్యలపై చంద్రబాబు హైదరాబాద్ ఏఐజీ, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే చంద్రబాబు విడుదల సమయంలో పవన్ కల్యాణ్ ఇటలీలో ఉన్నారు. ప్రజెంట్ ఇటలీ నుంచి రావడంతో వెంటనే చంద్రబాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. చంద్రబాబుకు అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఇకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చంద్రబాబు రిమాండ్ సమయంలో పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని పవన్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి కార్యచరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఇరువురిని ఒకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని తర్వాత ప్రభుత్వంపై పోరాటానికి త్వరలో ఉమ్మడి కార్యచరణను ప్రకటించనున్నారు.
ALSO READ :- గుడ్ న్యూస్ చెప్పిన మోదీ .. ఉచిత రేషన్ మరో ఐదేళ్లు