బండి సంజయ్ మనసులో మాట వినండి

బండి సంజయ్ మనసులో మాట వినండి

హైదరాబాద్ లో మత ఘర్షణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మనసులో మాట వినండంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇదిగో.. బీజేపీ నైజమని అభివర్ణించిన ఆయన... ఏ కుట్రకు ఈ గుసగుసలంటూ కామెంట్ చేశారు. వీళ్లా నాయకులు... ఇలాంటి క్రూర సిద్ధాంతాలు కలిగిన పార్టీని ఏం చేయాలో తెలంగాణ సమాజమే ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.  

ఇదిలా ఉండగా... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. తాము చేపట్టిన పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని అందులో పేర్కొంటూ బీజేపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ కేసును హైకోర్టు విచారణకు చేపట్టగా... శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పోలీసులు యాత్రకు నిరాకరించారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. యాత్రలో బండి సంజయ్ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ఆయన కామెంట్ల వల్ల మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందనే పాదయాత్రకు అనుమతి నిరాకరించినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ వాదనపై స్పందించిన న్యాయస్థానం 22 రోజుల పాటు పాదయాత్ర కొనసాగిన తర్వాత ఇప్పడు అనుమతి లేదని చెప్పడమేంటని ప్రశ్నించింది. ఏ కారణాల వల్ల యాత్రను నిలిపేశారో ఆధారాలను ఇవాళ సమర్పించాలని ఆదేశించింది.