తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలుపుతూ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత జ్ఞాపకాలను స్మరించుకుంటూ రేపటి భవిష్యత్ కోసం రాహుల్ కు మద్దతుగా నిలవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రాహుల్ పాదయాత్రలో కనీసం ఒక్క కిలోమీటరైనా కలిసి నడవాలని, దేశ ఐక్యత ప్రాధాన్యతను చాటాలని కోరారు. 

‘స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన అస్థిత్వానికి, ఆర్థిక స్థిరత్వానికి కారణం హైదరాబాద్. అలాంటి హైదరాబాద్ ను మనకు వరంగా ఇచ్చింది కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్నే కాదు.. ఇంతటి ఆర్థిక పరిపుష్ఠి నగరాన్ని మనకందించిన కాంగ్రెస్ నవ నాయకుడు రాహుల్ గాంధీ మన ముందుకు వస్తున్నారు. ఈ సందర్బంగా గత జ్ఞాపకాలను స్మరిస్తూ... రేపటి భవిష్యత్ కోసం ఆయనకు మద్దతుగా నిలుద్దాం. రాహుల్ గాంధీ అడుగుతో అడుగు కలుపుదాం. రాజకీయాలకు అతీతంగా ఆయనతో జత కడదాం. కనీసం ఒక్క కిలోమీటరైనా కలిసి నడుద్దాం. దేశ ఐక్యత మా ప్రాధాన్యత అని చాటుదాం. దేశం కోసం ఒక్క రోజు.. ఒక్క గంట గడప దాటి రండి. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వస్తారని ఆశిస్తూ..ఈ దేశం కోసం రాహుల్ తో కలిసి కదం తొక్కుతారని విశ్వసిస్తూ.. నవంబర్ 1న మధ్యాహ్నం 3గంటలకు చార్మినార్ వద్ద కలుసుకుందాం’ అంటూ లేఖలో రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 

మరోవైపు.. లేఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనను రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ దేశం కోసం అడుగు ముందుకు వేసి ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రశ్నిస్తూ ఆసేతు హిమాచలాన్ని ఏకం చేస్తూ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ పాదయాత్రగా బయలుదేరారని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో వేసిన తొలి అడుగు.. రాష్ట్రాలు దాటుతూ అక్టోబర్ 23న తెలంగాణలోకి ప్రవేశించిందన్నారు.