- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ రెండు పార్టీల మధ్య ట్రయల్ రన్: మహేశ్గౌడ్
- కిషన్రెడ్డి, కేటీఆర్ మైత్రీబంధం ప్రజలకు తెలుసు
- ఓటమి భయంతో అసత్యాలు మాట్లాడుతున్నరు
- 50 వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తాడని ధీమా
- అర్హులందరికీ పథకాలు అందిస్తున్నం: భట్టి
- జూబ్లీహిల్స్లో 14,230 రేషన్ కార్డులిచ్చినం: ఉత్తమ్
- నవీన్ యాదవ్ మరో పీజేఆర్ కాబోతున్నరు: పొన్నం
- బీఆర్ఎస్కు ఓట్లడిగే నైతిక హక్కు లేదు: జూపల్లి
- నోటిఫికేషన్కు ముందే రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు: వాకిటి
హైదరాబాద్, వెలుగు: బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం ఖాయమని పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ రెండు పార్టీల మధ్య ట్రయల్ రన్ లాంటిదని తెలిపారు. కిషన్రెడ్డి, కేటీఆర్ మైత్రీ బంధం జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసని అన్నారు. నియోజకవర్గంలోని యూసుఫ్గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మరో నలుగురు మంత్రులతో కలిసి మహేశ్ గౌడ్ మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం తథ్యమని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మతి భ్రమించి అసత్యాలు మట్లాడుతున్నారని మండిపడ్డారు. గత 15 ఏండ్లుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థను పట్టించుకోలేదని విమర్శించారు.
కేటీఆర్ జవాబు చెప్పాలి..
ఇతర కుటుంబాల్లో తలదూర్చే లక్షణం కాంగ్రెస్ పార్టీకి లేదని మహేశ్గౌడ్ అన్నారు. మాగంటి గోపీనాథ్ మరణంపై ఎంక్వైరీ చేయాలని ఆయన తల్లి ఇచ్చిన కంప్లయింట్పై, తన తండ్రి చావుకు హాజరుకాకుండా అమెరికాలో అడ్డకున్నారని మాగంటి పెద్ద భార్య కొడుకు వేస్తున్న ప్రశ్నలకు కేటీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. నవీన్యాదవ్ను రౌడీ అంటూ సంబోధిస్తున్న హరీశ్రావు.. తమ పార్టీ అభ్యర్థిపై ఎక్కడ, ఎలాంటి కేసులున్నాయో బయటపెట్టాలని అడిగారు. అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితం అయ్యారని, రాష్ట్ర ప్రజలు ఆయన పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో సున్నా సీట్లు రావడంతో ఏం చేయలేక కేసీఆర్ కాలు బయటపెట్టడం లేదని తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు, ఎలక్షన్స్ కంటే ముందు సర్కారు జూబ్లీహిల్స్లో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటర్లంతా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఎన్ని కుయుక్తులు, కుతంత్రాలు పన్నినా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని అన్నారు.
సంక్షేమం కోసం రూ.1.06 లక్షల కోట్ల ఖర్చు: భట్టి
రెండేండ్ల తమ ప్రభుత్వంలో కేవలం సంక్షేమ పథకాల కోసమే ఇప్పటి వరకూ రూ.1.06 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. అనేక అడ్డంకులను అధిగమించి గ్రూప్–1, గ్రూప్–2 తదితర 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. 51 లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్లోనే వందల కోట్లు ఖర్చుచేశామని, భవిష్యత్తులో కూడా ఇలాగే ముందుకు పోతామని చెప్పారు. పదేండ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నా హరీశ్రావు అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో తన ఇంట్లో ఐటీ రెయిడ్స్ జరిగితే బయటి ప్రపంచానికి తెల్వకుండా ఉంటుందా? అని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు చెందిన, చదువుకున్న యువకుడు నవీన్యాదవ్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. జూబ్లీహిల్స్ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే: ఉత్తమ్
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల్లో కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోనే 14,230 రేషన్ కార్డులిచ్చామని తెలిపారు. 67 వేల మందికి అదనంగా రేషన్ బియ్యం ఇవ్వడానికి రేషన్కార్డుల్లో పేర్లు నమోదు చేశామని చెప్పారు. నియోజకవర్గవ్యాప్తంగా 2.40 లక్షల మందికి ప్రతి నెలా ఉచితంగా మంచి క్వాలిటీతో కూడిన సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లంతా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని, మరో మూడేండ్లపాటు ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. కాంగ్రెస్కే ఓటేయాలని ముస్లిం మైనార్టీలకు పిలుపునిచ్చారు.
నవీన్యాదవ్ లోకల్: మంత్రి పొన్నం ప్రభాకర్
జూబ్లీహిల్స్ఎన్నికల్లో గెలిచి నవీన్యాదవ్ మరో పీజేఆర్లా పనిచేసేందుకు సిద్ధమయ్యారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేయడంతోపాటు 42శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలవడం చాలా ముఖ్యమన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజవర్గ పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ లో ఈ సారి జరిగే ఉప ఎన్నికలో.. ఆ పార్టీ అభ్యర్థికి 10 వేల ఓట్లు కూడా దాటవని అన్నారు. స్థానికుడు, లోకల్ సమస్యలపై పట్టున్న వ్యక్తి, బలహీనవర్గాల అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
70 వేల కోట్ల వడ్డీ కడుతున్నం: మంత్రి జూపల్లి
బీఆర్ఎస్ సర్కారు చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పులకు ప్రతి ఏటా రూ.70 వేల కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 64 ఏండ్లలో 22 మంది సీఎంలు పాలించగా.. రూ.65 వేల కోట్ల బాకీ అయితే.. ఏటా కేవలం రూ.6 వేల కోట్ల వడ్డీలు చెల్లిస్తే సరిపోయేదన్నారు. అలాంటిది కేసీఆర్ సర్కారు పదేండ్లలోనే రూ8 లక్షల కోట్లు అప్పు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై వడ్డీల రూపంలో అతి పెద్ద భారం పడిందని, బడ్జెట్ నుంచి ప్రతిఏటా అప్పు వడ్డీల కిందనే రూ.70 వేల కోట్లు చెల్లిస్తున్నట్టు చెప్పారు. పదేండ్లలో ఏ ఒక్క హామీని సరిగ్గా నెరవేర్చని బీఆర్ఎస్ పార్టీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదని అన్నారు.
కాంగ్రెస్ను గెలిపిస్తే 500 కోట్లతో అభివృద్ధి: వాకిటి శ్రీహరి
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మాగంటి గోపినాథ్ పదేండ్లు అధికారంలో ఉన్నా.. ఇక్కడ మంచినీటి సమస్య పరిష్కరించలేదని అన్నారు. వాళ్లు చేసిన పాపానికి తెల్లవారుజామున 3 గంటలకు లేచి లైన్లలో నిలబడి నల్లానీళ్లు తెచ్చుకుంటున్నామని మహిళలు తమతో చెప్పారని తెలిపారు. ఉప ఎన్నికల రూపంలో వచ్చిన ఈ అవకాశాన్ని వృథా చేసుకోవద్దని, ఓటు హక్కును బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాబోయే మూడేండ్లలో రూ.500 కోట్లతో అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్, కేబినెట్ మంత్రులు మొత్తం సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
