
- పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ
ముషీరాబాద్, వెలుగు: హోంగార్డులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. నేషనల్ హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి పాకాల రాజశేఖర్ శనివారం సాయంత్రం ఢిల్లీలో ఎంపీ వంశీకృష్ణను కలిసి హోంగార్డుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం పాకాల రాజశేఖర్ మాట్లాడుతూ.. హోంగార్డుల సమస్యలను ఎంపీ వంశీకృష్ణ తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. హోంగార్డులకు జీతం, ఉద్యోగ పర్మినెంట్, ప్రమోషన్ ఇతర సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. అంతేకాకుండా పెద్దపల్లి నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకొని పార్లమెంట్లో ఆయన మాట్లాడుతున్నారని, హోంగార్డుల సమస్యలను కూడా సభలో మాట్లాడాలని కోరామన్నారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని రాజశేఖర్ తెలిపారు.