- ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపనకు ఏర్పాట్లు
- తాజాగా కూలింగ్ టవర్స్, రైల్వే వ్యాగన్ ట్రిప్లర్ నిర్మాణ ప్రాంతాల్లో భూమి పూజ
- రూ.6,700 కోట్లతో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మించనున్న బీహెచ్ఈఎల్
- మూడో యూనిట్ కోసం రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ
- సింగరేణికి ఆదాయంతో పాటు స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు
కోల్బెల్ట్/జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్పవర్ప్లాంట్(ఎస్టీపీపీ) మూడో యూనిట్ కు మరో అడుగు పడింది. గురువారం ప్లాంట్ కూలింగ్ టవర్స్, రైల్వే వ్యాగన్ ట్రిప్లర్ను నిర్మించే స్థలాల్లో సింగరేణి డైరెక్టర్(ఈఎం) తిరుమల్రావు భూమి పూజ చేశారు. దీంతో మూడో యూనిట్ నిర్మాణ పనులు స్పీడ్ అందుకున్నాయి.
ఫిబ్రవరిలో సీఎం రేవంత్రెడ్డి ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని ఇప్పటికే రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టత ఇచ్చారు. కొద్దిరోజులుగా కలెక్టర్, సింగ రేణి ఉన్నతాధికారులతో కలిసి జైపూర్ఎస్టీపీపీని సందర్శిస్తున్నారు. మూడో యూనిట్ నిర్మాణానికి కావాల్సిన ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటికే పైలాన్ నిర్మించారు. రూ.6,700 కోట్లతో ఏర్పాటయ్యే మూడో యూనిట్ కాంట్రాక్ట్ ను భారత్హెవీ ఎలక్ర్టికల్స్ లిమిటెడ్(భెల్) దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి సింగరేణి 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్ను ఎస్టీపీపీ నిర్మించనుంది.
ఎన్టీపీసీ నిర్మాణంలో కాకా కుటుంబం కృషి
మాజీ పెద్దపల్లి ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి, ఆయన తనయుడు అప్పటి కార్మికశాఖ మంత్రి గడ్డం వినోద్.. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి ఒప్పించారు. ఫలితంగా 2005లో కాంగ్రెస్ హయాంలోనే ఎస్టీపీపీ నిర్మాణం షురూ అయింది. రూ.7,573 కోట్ల అంచనాతో 600 మెగావాట్లతో రెండు యూనిట్లు కలిపి మొత్తం1,200 మెగావాట్ల పవర్ ప్లాంట్ను నిర్మించారు.
ప్రస్తుతం ఎన్టీపీసీ ఉత్పత్తి చేసే విద్యుత్ లో160 మెగావాట్లు మాత్రమే సొంతానికి వాడుకుంటూ, మిగతా పవర్ 1,040 మెగావాట్లను జెన్కో ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముతోంది. అదేవిధంగా మూడో యూనిట్ ప్లాంట్ కోసం కాకా రెండో తనయుడు పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి చొరవతో సుమారు1,883 ఎకరాలను సేకరించారు. దీంతో మరో 600 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి 2015 మార్చిలో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే.. కేంద్రం పర్యావరణానికి సంబంధించిన అభ్యంతరాలు తెలపడంతో టెండర్ల దశలోనే ఆగిపోయింది.
దీంతో మూడో యూనిట్ నిర్మాణంపై పై సందేహాలు తలెత్తాయి. కాగా.. చెన్నూరు ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవ తీసుకుని 800 మెగావాట్లతో ప్లాంటు నిర్మించేందుకు అసెంబ్లీలో ప్రస్తావించారు.
అనంతరం సీఎం, డిప్యూటి సీఎంను ఒప్పించారు. దీంతో సింగరేణి మళ్లీ టెండర్లు పిలవగా రూ.6,700 కోట్లతో నిర్మించేందుకు 2024 ఫిబ్రవరిలో బీహెచ్ఈఎల్(భెల్) సంస్థ దక్కించుకుంది. డిజైన్,ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సప్లయ్, సివిల్ వర్క్స్ పనులు సదరు సంస్థ చేపట్టనుంది.
అదనపు ఆదాయం.. యువతకు జాబ్ లు
కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్కు ఎస్టీపీపీలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అవసరమైన బొగ్గును సింగరేణి సంస్థకు చెందిన యూజీ, ఓసీపీ గనులు నుంచి తీసుకుంటారు. శ్రీరాంపూర్ సీహెచ్పీ రైల్వే ట్రాక్లైన్ ను వినియోగిస్తారు. ఏటా 4 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. రెండు యూనిట్లకు నీటిని సరఫరా చేసేందుకు షెట్పల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్ నుంచే మూడో ప్లాంట్కు అందిస్తారు. కొత్తగా భూ సేకరణ అవసరం లేదు. ఎస్టీపీసీలోని127 హెక్టార్లను కేటాయిస్తారు. భవిష్యత్ లో మరో 800 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి ఆలోచన చేస్తోంది. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే రాష్ట్ర అవసరాల్లో 25 శాతానికి పైగా విద్యుత్ అవసరాలను తీర్చనుంది.
ఇప్పటికే రెండు ప్లాంట్ల నుంచి సింగరేణికి ఏటా రూ.500 కోట్లకుపైగా లాభాలు వస్తుండగా, మూడో ప్లాంట్ ద్వారా అదనంగా మరో రూ.500 కోట్లు ఆర్జించనుంది. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎస్టీపీపీలో 80 శాతం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ జాబ్ లు స్థానికులకే ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. మూడో యూనిట్తో సుమారు 2 వేల మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
