
- ‘చేయూత’ పథకంతో ఆర్థిక భరోసా
- ఫైల్పై మంత్రి సీతక్క సంతకం
- 2022 నుంచి ఆగిపోయిన కొత్త పింఛన్ల మంజూరు
హైదరాబాద్, వెలుగు: హెచ్ఐవీ బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా14,084 మంది హెచ్ఐవీ బాధితులకు చేయూత పింఛన్లు మంజూరు చేస్తూ సోమవారం ఫైల్పై మంత్రి సీతక్క సంతకం చేశారు. జులై నుంచి లబ్ధిదారులు పింఛన్లు అందుకోనున్నారు. హెచ్ఐవీ బాధితులు పూర్తిస్థాయిలో పనిచేయలేని స్థితిలో ఉండటంతోపాటు వారికి నెలనెలా వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారికి పింఛన్లు అందించేందుకు ముందుకొచ్చింది. పేదరికంతో బాధపడుతున్న హెచ్ఐవీ బాధితుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చేయూత పథకం కింద సాయం అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే 34,421 మందికి నెలకు రూ.2,016 చొప్పున పింఛన్ అందిస్తున్నది. ఇందుకోసం నెలకు రూ.6.93 కోట్లు ఖర్చు చేస్తోంది. 2022 ఆగస్టు తర్వాత హెచ్ఐవీ కేటగిరీలో కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీజీఎస్ఏసీఎస్) ఆధ్వర్యంలో కొత్తగా నమోదైన 14,084 మందికి అర్హతలు నిర్ధారించిన అనంతరం సెర్ప్ ద్వారా పింఛన్లు మంజూరు అయ్యాయి.
9 జిల్లాల్లో ఒక్కరూ నమోదు కాలే..
జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్కర్నూల్, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా ఒక్కరు కూడా హెచ్ఐవీ బాధితులు నమోదు కాలేదు. హైదరాబాద్ లో 3,019 మంది, నల్గొండలో 1,388, ఖమ్మంలో 954, సూర్యాపేటలో 931, కరీంనగర్ లో 833, ఆదిలాబాద్ లో -482, భద్రాద్రి కొత్తగూడెంలో- 556, హనుమకొండలో -825, జగిత్యాలలో- 306, జనగామలో- 228, కామారెడ్డిలో -702, మహబూబ్ నగర్ లో- 452, నిజామాబాద్ లో- 528, పెద్దపల్లిలో-567, సంగారెడ్డిలో -1,242, సిద్దిపేటలో -527, వికారాబాద్ లో- 544 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. కొత్త లబ్ధిదారులకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.28.40 కోట్లు అవసరమవుతాయని, ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే 4,020 మంది డయాలసిస్ పేషెంట్లకు ఇటీవల పింఛన్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. హెచ్ఐవీ బాధితులకు ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు సామాజిక భద్రత కల్పించాలన్నదే సర్కార్ లక్ష్యమని పేర్కొన్నారు.