టీఆర్ఎస్ జాతీయ పార్టీ ఆవిర్భవించబోతోంది

టీఆర్ఎస్ జాతీయ పార్టీ ఆవిర్భవించబోతోంది
  • ప్రజా సమస్యల పరిష్కారం కేసీఆర్తోనే సాధ్యం
  • ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

హనుమకొండ జిల్లా: టీఆర్ఎస్ జాతీయ పార్టీ ఆవిర్భవించబోతోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వెల్లడించారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని చెప్పారు. హన్మకొండ వడ్డెపల్లిలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు కావాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. 
 ప్రజల సమస్యలను సీఎం కేసీఆర్ ఒకదాని తర్వాత ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వెళుతున్నారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. ‘ఇరుగు పొరుగు రాష్ట్రాలే కాదు.. దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు తెలంగాణ మోడల్ కావాలని కోరుకుంటున్నారు.. తెలంగాణ తరహాలో అభివృద్ధి జరగాలని.. ఇక్కడ అమలవుతున్న పథకాలు తమకు కూడా కావాలని కోరుకుంటున్నారు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాదు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణ తరహా పాలన కావాలని కోరుకుంటున్నారు..’ అని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.