తెలంగాణలో కాంగ్రెస్‌ దే హవా

తెలంగాణలో కాంగ్రెస్‌ దే హవా

తెలంగాణలో రాజకీయ పరిస్థితులను, పార్టీల బలాబలాలను పరిశీలిస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు ఆధిక్యత చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అధికార పీఠం అందించేందుకు ప్రజల మనసులో ఎవరున్నారో అంచనా వేయడానికి.. సౌత్‌ ఫస్ట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ట్రాకర్‌ పోల్‌ సర్వే నిర్వహించింది.  పీపుల్స్‌ పల్స్‌ - సౌత్‌ ఫస్ట్‌ ట్రాకర్‌ పోల్‌ సర్వే ప్రకారం...  తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ సగానికి పైగా స్థానాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిని ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్‌ఎస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో కూడా రెండో స్థానానికే పరిమితం కానుంది.

అయోధ్య రామమందిరం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే, రామమందిరం ప్రభావం తెలంగాణలో బీజేపీ ఉహిస్తున్నంతగా భారీస్థాయిలో లేదు. ఫలితంగా ఆ పార్టీకి 2019లో వచ్చిన నాలుగు సీట్ల కంటే మెరుగైన ఫలితాలు రావడం కష్టతరంగా మారింది. పీపుల్స్‌ పల్స్‌ -సౌత్‌ ఫస్ట్‌ ట్రాకర్‌ పోల్‌ సర్వే ప్రకారం... రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్‌ 8- నుంచి10 స్థానాలు, బీఆర్‌ఎస్‌ పార్టీ 3 నుంచి- 5 స్థానాలు, బీజేపీ 2- నుంచి 4 స్థానాలు, ఇతరులు ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉంది.  గత నవంబర్​లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ  మొత్తం 39.4 శాతం ఓట్లు సాధించింది. ఈ ఓటింగ్‌ శాతాన్ని కాంగ్రెస్‌ మెరుగుపరుచుకుంటూ ఈ లోక్‌సభ ఎన్నికల్లో 40 శాతం ఓట్లు సాధించనుంది. 2023 ఎన్నికలతో పోలిస్తే బీఆర్‌ఎస్‌  పార్టీ 6 శాతం ఓట్లు కోల్పోయి, 31 శాతం ఓట్లతో  రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో నిలిచిన బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభావంతో 13.9 శాతం ఓట్ల నుంచి 23 శాతానికి పెరిగింది. ఏ సర్వేకైనా ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 3 శాతం ఎర్రర్‌ ఉంటుంది. 

సిట్టింగ్​ ఎంపీలపై అసంతృప్తి

మూడు ప్రధాన పార్టీల సిట్టింగ్‌ ఎంపీల పనితీరు గురించి అడిగినప్పుడు... 40 శాతం మంది బాగాలేదని చెప్పారు.  బీజేపీలో ఉన్న నలుగురు సిట్టింగు ఎంపీల్లో  ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోగా, 9 మంది బీఆర్‌ఎస్‌ ఎంపీల్లో  ఒకరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేసి విజయం సాధించారు. పీపుల్స్‌ పల్స్‌ -సౌత్‌  ఫస్ట్‌ ట్రాకర్‌ పోల్‌ సర్వే ప్రకారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌,  కరీంనగర్‌,  హైదరాబాద్‌, -రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ బలంగా ఉంది. అయితే, ఈ జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ కూడా అంతే బలంగా ఉంది. వీరికి తోడు కాంగ్రెస్‌ అధికార పార్టీ కావడంతో ఈ జిల్లాల్లోని లోక్‌సభ స్థానాల్లో త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. ఎస్సీకి రిజర్వ్‌ చేసిన నాగర్‌ కర్నూల్‌, వరంగల్‌, పెద్దపల్లి  లోక్‌ సభ నియోజకవర్గాల్లో బీజేపీకి సింగిల్‌ డిజిట్‌ ఓట్‌ షేర్‌ కే పరిమితం కానుంది. ఎస్టీకి రిజర్వ్‌ చేసిన మహబూబాబాద్‌ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. 

పీపుల్స్‌ పల్స్‌ సర్వే ఇలా..

ఫిబ్రవరి 11 నుంచి 17వ తేదీ వరకు సౌత్‌ ఫస్ట్‌ వెబ్‌ సైట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఈ ట్రాకర్‌ పోల్‌ సర్వే నిర్వహించింది. పీపుల్స్‌ పల్స్‌ సంస్థలో సీనియర్‌ రీసెర్చర్‌  జి. మురళీ కృష్ణ  ఈ సర్వేను  పర్యవేక్షించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17 లోక్‌ సభ స్థానాల్లో ఈ ట్రాకర్‌ పోల్‌ సర్వేలో నిర్వహించాం.  ప్రతి పార్లమెంటు స్థానంలో మూడు అసెంబ్లీ స్థానాలను ఈ సర్వే కోసం ఎంచుకున్నాం.  ప్రాబబిలిటీ  ప్రొఫెష‌న‌ల్‌  మెథడాలజీ (పీపీఎస్‌) ద్వారా ఈ మొత్తం 51 అసెంబ్లీ స్థానాల్లో ఈ సర్వే జరిగింది. ప్రతి అసెంబ్లీలో 5 పోలింగ్‌ కేంద్రాలను ఎంచుకుని, 15 నుంచి 20 సిస్టమేటిక్‌ ర్యాండమ్‌ శాంపిల్స్‌ తీసుకున్నాం. క్షేత్రస్థాయిలో ఉన్న ప‌రిస్థితుల‌ను అద్దం పట్టేలా  కులం, మతం, వయసు, లింగప్రాతిపదికన సమాన నిష్పత్తిలో  మొత్తం 4,600 శాంపిల్స్‌  సేకరించాం. ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా ఈ సర్వే డేటా సేకరించాం.

ప్రధానిగా మోదీవైపే మొగ్గు

 ప్రధాన మంత్రి ఎవరయితే బాగుంటుందని అడిగినప్పుడు 34 శాతం మంది నరేంద్ర మోదీకే మద్దతు తెలిపారు. 23 శాతం మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రెండో స్థానంలో ఉన్నారు. ఇక 39 శాతం మంది ఎన్డీయే ప్రభుత్వం పనితీరు బాగాలేదని చెప్పగా 33 శాతం మంది బీజేపీకి మరో అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. రామమందిర ప్రభావం కేవలం 22 శాతం మంది  ఓటర్ల మీద మాత్రమే ఉంది.  మొత్తంగా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ మొదటి స్థానంలో ఉండగా, బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండో స్థానం కోసం పోరాడనున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రాంతీయ పార్టీ కావడం వల్ల ఈ ఎన్నిక ఆ పార్టీకి కీలకం కానుంది. ఒకవేళ లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు వస్తే  ఆ పార్టీ మరింత బలహీనపడే అవకాశాలు ఉన్నాయి.  

కాంగ్రెస్​ ముందంజ

కులాలు, గ్రామాలు, పట్టణాలు, వయసు, లింగ ప్రాతిపదికన చూసినప్పుడు బీఆర్‌ఎస్‌, బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌ అన్ని విభాగాల్లో ముందంజలో ఉంది. ఆసక్తికరంగా ఈసారి ముస్లిం ఓట్లలో కూడా బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ ఆధిక్యత ప్రదర్శించనుంది. పీపుల్స్‌ పల్స్‌ -సౌత్‌ ఫస్ట్‌ సర్వే ప్రకారం  దాదాపు 52 శాతం ముస్లిం సామాజికవర్గం కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తుండగా, బీఆర్‌ఎస్‌కి 38 శాతం ముస్లింలు మాత్రమే మద్దతిస్తున్నారు. మహిళల్లో 42 శాతం, పురుషుల్లో 37 శాతం మంది కాంగ్రెస్‌కి  మద్దతిస్తున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్‌కి సానుకూల పవనాలు వీస్తున్నాయి.

 గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కి 42 శాతం మంది మద్దతిస్తుండగా, పట్టణాల్లో 37 శాతం మంది మద్దతుగా నిలిచారు. 18 నుంచి 25 ఏండ్లలోపు వయసున్న ఓటర్లలో  బీఆర్‌ఎస్‌ కంటే, బీజేపీ ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా ఓబీసీలు, రెడ్డి సామాజికవర్గాల్లో కూడా బీఆర్‌ఎస్‌ కన్నా బీజేపీ ముందంజలో ఉంది. సర్వేలో పాల్గొన్న వారిలో 34 శాతం మంది కాంగ్రెస్‌ పాలన బాగుందని చెప్పగా, 33 శాతం మంది ఫర్వాలేదని చెప్పారు. గత మూడు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో పాటు ఉద్యోగాల భర్తీ,  ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందివ్వడం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు.

- జి. మురళీ కృష్ణ, సీనియర్‌ రీసెర్చర్‌, పీపుల్స్‌ పల్స్‌