మేడారం గతంలో కనిపించిన ఆదివాసీ ఇండ్ల స్థానంలో, మెయిన్ రోడ్ల వెంట ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్లు వెలిశాయి. జాతర లేని రోజుల్లో సైతం ఎక్కడ చూసినా హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లే కనిపిస్తున్నాయి. షాపుల వెనుకాల వరుసగా గదులు కట్టి.. ఏసీ, నాన్ ఏసీ పేరుతో కిరాయికి ఇస్తున్నారు.
భక్తుల సంఖ్య పెరగడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల కంటే ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారు. మేడారంలో అధికారిక లిక్కర్ షాపులు లేకున్నా.. ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. హోటళ్లు, కూల్డ్రింక్ షాపులు, కిరాణం, కొబ్బరికాయల దుకాణాల్లో సైతం లిక్కర్ దొరుకుతోంది.
గద్దెల చుట్టూరా బిల్డింగులే...
మేడారం సమక్క సారలమ్మ జాతర అంటేనే వన జాతరగా చెబుతుంటారు. కానీ.. జాతర జరిగే ప్రధాన ప్రాంతమైన అమ్మవార్ల గద్దెల చుట్టూరా బిల్డింగ్లు నిర్మించడంతో ఈ ప్రాంతం సహజత్వం కోల్పోతోంది. అమ్మవార్ల గద్దెలను ఆనుకునే మూడు అంతస్తుల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించారు. జంపన్నవాగు వైపు టీటీడీకు సంబంధించిన మూడు అంతస్తుల బిల్డింగ్ ఉండగా.. దానికి ఎదురుగా ఐటీడీఏ గెస్ట్హౌస్ కట్టారు.
ఇక తల్లులను దర్శించుకుని బయటకు వెళ్లే దారిలో రెండు వైపులా దేవాదాయ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల బిల్డింగ్లు ఉన్నాయి. పర్యాటకుల కోసం హరిత హోటళ్లు కట్టామని చెబుతున్నా.. వాటిని ఏనాడూ సామాన్య భక్తులకు ఇవ్వట్లేదు. పర్మినెంట్, టెంపరరీ టెంట్లతో కలిసి 40 నుంచి 45 వరకు ఏసీ సర్వీస్ రూంలు ఉన్నా.. అవన్నీ మంత్రులు, లీడర్లు వారి అనుచరులు, ఆఫీసర్లు ఉండేందుకే కట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
