
న్యూఢిల్లీ: లోన్ ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ విధించిన మూడు నెలల మారటోరియంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మారటోరియం కాలంలో ఏ బ్యాంక్, ఆర్థిక సంస్థలు అదనంగా వడ్డీ వేయకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. మార్చి 27న మారటోరియంపై ఆర్బీఐ జారీ చేసిన సర్క్యూలర్ అసంపూర్తిగా ఉందని, దానిని పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాయం చేసేలా మారటోరియం కాలాన్ని మరింత పొడిగించేలా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అడ్వొకేట్ అమిత్ సాహ్ని ఈ పిటిషన్ దాఖలు చేశారు. మారటోరియం కాలంలో ఈఎంఐలతోపాటు అదనంగా వడ్డీని చెల్లించాలని చెప్పడంలో అర్థం లేదన్నారు. కరోనా కారణంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలపై మూడు నెలల మారటోరియాన్ని ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది. మార్చి 1 నుంచి మే 31 వరకు ఈ మారటోరియాన్ని అమలు చేయాలని అన్ని బ్యాంక్లను ఆదేశించింది.