- వరుసగా 17 వ రోజూ తప్పని షాక్
వరుసగా 17 వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్, డీజిల్ సుమారు ఒకే ధర వద్ద పలుకుతున్నాయి. లీటర్ పెట్రోల్పై 20 పైసలు, డీజిల్పై 55 పైసలను మంగళవారం ఆయిల్ కంపెనీలు పెంచాయి. దీంతో డీజిల్ ధరలు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 79.76 కు, డీజిల్ రూ. 79.40 కు చేరుకున్నాయి. వీటి మధ్య తేడా కేవలం 36 పైసలు మాత్రమే. ఇంటర్నేషనల్ బెంచ్మార్క్ రేట్ల ప్రకారం ఎక్కడైన పెట్రోల్ ధర డీజిల్ కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఢిల్లీ ప్రభుత్వం డీజిల్పై వ్యాట్ను భారీగా పెంచడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఒకే స్థాయికి చేరుకున్నాయి. మే నెల ప్రారంభంలో ఈ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర మధ్య రూ. 7.30 లు గ్యాప్ ఉండేది. కానీ వీటిపై వ్యాట్లను పెంచడంతో ధరలలో మార్పులొచ్చాయి. కేజ్రివాల్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై వ్యాట్ను 27 శాతం నుంచి 30 శాతానికి, డీజిల్పై 16.75 శాతం నుంచి 30 శాతానికి పెంచింది. వీటికి తోడు గత 17 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్పై ధరలను ఆయిల్ కంపెనీలు పెంచుతూనే ఉన్నాయి. ఈ 17 రోజుల్లో లీటర్ పెట్రోల్ రూ. 8.50 లు, డీజిల్ రూ. 10.01 లు పెరిగాయి. మిగిలిన సిటీలలో పెట్రోల్, డీజిల్ ధరల మధ్య గ్యాప్ ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.82.79గా, డీజిల్ ధర 77.60 గా ఉంది. వీటి మధ్య రూ. 5.19 లు గ్యాప్ ఉంది.