అమెరికా దెబ్బకు పెరుగనున్న పెట్రోల్ ధరలు

అమెరికా దెబ్బకు పెరుగనున్న పెట్రోల్ ధరలు
  • అమెరికా దెబ్బకు ఇరాన్ ఆయిల్ బంద్

ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు ఆపేయాలని ఇండియా నిర్ణయించింది. ఇరాన్‌ పై ఆంక్షలను కఠినతరం చేసే లక్ష్యంతో , అమెరికా ఇప్పటిదాకా ఇచ్చిన సడలింపులు నిలిపేస్తోంది. ఫలితంగా గ్లోబల్​ చమురు ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్​ దిగుమతులు ఆగిపోతుందడంతో , తప్పనిసరి పరిస్థితులలోఇండియా కూడా చమురు దిగుమతుల కోసం సౌదీ అరేబియా వంటి దేశాల వైపు చూస్తున్నట్లు ప్రభుత్వ, ప్రైవేటు వర్గాల సమాచారం. ఇరాన్‌ పై ఆంక్షలు విధించినా, ఇండియా సహా కొన్నిదేశాలకు అమెరికా ఇప్పటిదాకా సడలింపులు అమలు చేసింది. ఇక ఇరాన్‌ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం సాధ్యం కాదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

ఆంక్షలసడలింపును మే తర్వాత కూడా కొనసాగించాలని అమెరికా మీద వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాలని ఇండియా భావిస్తోంది. అమెరికా అందుకు ఒప్పుకుంటుందనే భావనతో ఇప్పుడు చమురు కొనుగోలును కంటిన్యూ చేయడం సరయినది కాదని ఆ అధికారి పేర్కొన్నారు. ఇరాన్‌ నుంచి ఎక్కువగా చమురు దిగుమతి చేసుకునే దేశాలలో రెండవ పెద్ద దేశం ఇండియానే. మొదటిది చైనా. మార్చి31, 2019 తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలోఇరాన్‌ నుంచి ఇండియా 24 మిలియన్‌ టన్నుల క్రూడాయిల్‌ ను దిగుమతి చేసుకుంది. ఇరాన్‌సరఫరా నిలిచి పోతే, చమురు ఎగుమతి చేసే సౌదీఅరేబియా, కువైట్‌ , యూఏఈ, మెక్సికో వంటిదేశాల నుంచి దిగుమతికి ఇండియా ప్రయత్నించాల్సి వస్తుంది. ఇండియాలోని ఆయిల్‌ రిఫైనరీస్‌ కు ఇబ్బంది లేని విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు. దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ , ఇతరపెట్రోలియం ఉత్పత్తులకు కొరత రాకుండా చూస్తామని తెలిపారు.

షరతులతో మినహాయింపులు
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కిందటేడాది ఇరాన్ మీద ఆంక్షలు విధించారు. ఇండియా, జపాన్ ,సౌత్ కొరియా, తైవాన్, టర్కీ, ఇటలీ, గ్రీస్ దేశాలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. దానికి కూడా ఒక కండిషన్ పెట్టారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు తగ్గించుకుంటామని ఈ ఎనిమిది దేశాలు ఒప్పుకోవాలని. నవంబర్ 2018లో మొదలైన ఆంక్షల సడలింపు , మే 2 దాకా కొనసాగనుంది. నెలకు తన కొనుగోళ్లను1.25 మిలియన్ టన్నులకు పరిమితం చేసేందుకు ఇండియా ఒప్పుకుంది. 2017–18లో ఇరాన్ నుంచి దిగుమతులు 22.6మిలియన్ టన్నులు కాగా, 2018–19 నాటికి అవి 24 మిలియన్ టన్నులకు పెరిగాయి. ఇతర దేశాల నుంచి సరఫరాకు కొన్ని ఒప్పందాలున్నాయని, అవసరమైతేనే కొనేందుకు ఈ ఒప్పందాలు అవకాశ మిస్తున్నాయని సంజీవ్ సింగ్ తెలిపారు. ఇంకా అవసరమైతే, క్రూడ్ స్పాట్ మార్కెట్లో నూ కొనుగోళ్లు జరపొచ్చని పేర్కొన్నారు. ఐఓసీకి అయితే కొరత ఉండదని వెల్లడించారు. కాకపోతే, ఆంక్షల సడలింపు ఎత్తేయాలనే అమెరికా నిర్ణయంతో గ్లోబల్ చమురు ధరలు తాత్కాలికంగా పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. మెక్సికో నుంచి అదనంగా 0.7 మిలియన్ టన్నుల చమురు దిగుమతికి ఐఓసికి అవకాశముందన్నారు.

సౌదీ అరేబియా నుంచి కూడా అదనంగా 2 మిలియన్ టన్నులకొనుగోలుకు, కువైట్ నుంచి 1.5 మిలియన్ టన్నులు, యూఏఈ నుంచి 1 మిలియన్ టన్నుల కొనుగోలుకు అవకాశం ఉందని సింగ్ తెలిపారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆరు నెలల గరిష్టానికి, అంటేబారెల్ 74.46 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ సోమవారం 3 శాతం పెరిగింది. ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి బైటకి వస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన తర్వాత బారెల్ చమురు ధర అమాంతం 85 డాలర్లకు ఎగిసింది. ఆంక్షలు సడలించి నప్పుడు బారెల్ చమురు ధర50 డాలర్లకు తగ్గింది. ఇండియా ప్రపంచంలోనే మూడో పెద్ద చమురు వినియోగ దేశం. తన ఇంధన అవసరాలలో 80 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోంది. ఇరాక్, సౌదీ అరేబియాల తర్వాత ఇండియాకు ఎక్కువగా ఆయిల్ సరఫరా చేసేది ఇరానే. అంతేకాదు, క్రూడ్ దిగుమతులపై ఇండియాకు ఇరాన్ 60రోజుల క్రెడిట్ ఇవ్వడమే కాకుండా, సులభమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ సదుపాయం ఇండియాకు సౌదీ, కువైట్ , ఇరాక్, నైజీరియా,అమెరికా వంటి దేశాల నుంచి లేదు.