
- ఆ టన్నెల్లో ఆయుధాలు దాచిపెట్టారని ఆరోపణ
న్యూఢిల్లీ: గాజాలోని ఖాన్ యూనిస్ లో ఓ ప్రధాన హాస్పిటల్ కింద హమాస్ టన్నెల్ ను కనుగొన్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. ఈ మేరకు ఐడీఎఫ్ ఒక వీడియో రిలీజ్ చేసింది. యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్ ప్రాంతంలో ఆ టన్నెల్ ను కనుగొన్నామని, దానిని హమాస్ టెర్రరిస్టులు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ గా వాడుతున్నారని ఐడీఎఫ్ అధికారులు పేర్కొన్నారు.
అంతేకాకుండా ఆ సొరంగంలో పలు గదులు నిర్మించారని, వాటిలో ఆయుధాలు, ఇంటెలిజెన్స్ మెటీరియల్, ఆపరేషనల్ ఎక్విప్ మెంట్ వంటివి దాచిపెట్టారని చెప్పారు. ‘‘గోలాని బ్రిగేడ్, యహల్హం యూనిట్, స్పెషల్ ఫోర్సెస్ తో కూడిన బలగాలతో గాజాపై దాడిచేసినపుడు ఆ హాస్పిటల్ కింద టన్నెల్ ను కనుగొన్నాం. గాజాలోని హాస్పిటల్స్ ను సైతం హమాస్ టెర్రరిస్టులు వదలడం లేదు. హాస్పిటల్స్ ను టెర్రరిస్టు కార్యకలాపాల కోసం వాడుకుంటున్నారు. తాజాగా మేము కనుగొన్న సొరంగ మార్గమే అందుకు నిదర్శనం. 2023లోనూ గాజాలోనే అతిపెద్ద ఆసుపత్రి అల్ షిఫా కింద హమాస్ టన్నెల్ ను గుర్తించాం. అందులోనూ టెర్రరిస్టులు ఆయుధాలు దాచి ఉంచారు” అని ఐడీఎఫ్ అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్ కాల్పుల్లో నలుగురు మృతి
గాజా స్ట్రిప్లో మానవతాసాయం అందిస్తున్న కేంద్రం వద్ద ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరిపాయని, ఈ కాల్పుల్లో నలుగురు చనిపోయారని పాలస్తీనా హెల్త్ ఆఫీసర్లు తెలిపారు. మానవతా సాయం కేంద్రానికి కిలోమీటర్ దూరం నుంచి ఇజ్రాయెల్ ఫోర్సెస్ కాల్పులు జరిపాయని వారు చెప్పారు. ఆ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను ఖాన్ యూనిస్లోని హాస్పిటల్కు తరలించారని తెలిపారు.