మథురలో జడ్జి మంగళసూత్రం చోరీ.. పది మంది మహిళా దొంగల అరెస్టు

మథురలో జడ్జి మంగళసూత్రం చోరీ.. పది మంది మహిళా దొంగల అరెస్టు

మథుర: ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని మథురలో గల ఆలయాలలో మహిళా భక్తులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్​చేశారు. మొత్తం పది మందిని అరెస్టు చేసినట్టు ఆదివారం వారు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌‌‌‌లోని ఉజ్జయినిలో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న ప్రేమా సాహు ఈ నెల 1న తన కుటుంబ సభ్యులతో కలిసి బృందావనంలోని ఠాకూర్ శ్రీ రాధారామన్ ఆలయాన్ని సందర్శిస్తుండగా ఆమె మెడలోని బంగారు మంగళసూత్రం చోరీకి గురైంది. ఈ ఘటన తర్వాత మథుర సీనియర్ ఎస్పీ శ్లోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆలయాలలో చోరీలకు పాల్పడే దొంగలను గుర్తించేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. 

ఈ క్రమంలో శనివారం పది మంది మహిళా దొంగలను అరెస్టు చేశారు. వారు దొంగిలించిన పర్సులలో ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డెబిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌లు, ఇతర ముఖ్యమైన పత్రాలు లభ్యమయ్యాయి. వాటితో పాటు రూ.18,652 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మధ్యప్రదేశ్, రాజస్థాన్‌‌‌‌కు చెందినవారని పోలీసులు గుర్తించారు. వారంతా బృందావనం, మథురలో రద్దీగా ఉండే దేవాలయాలలో జేబు దొంగతనాలతో పాటు ఫోన్లు, విలువైన ఆభరణాలను దోచుకుంటున్నారని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్​ చేసిన వారందరినీ జైలుకు పంపామని ఎస్పీ తెలిపారు.