మాల్దీవుల నుంచి బయలుదేరిన జలశ్వా
కొచ్చి: వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని సముద్ర మార్గం ద్వారా తిరిగి మన దేశానికి తీసుకొచ్చేందుకు ప్రారంభించిన ఆపరేషన్ సముద్ర సేతు ఫేజ్ – 2 షురూ అయింది. 588 మంది మనవాళ్లతో యుద్ధ నౌక ఐఎన్ఎస్ జలశ్వా మాల్దీవుల నుంచి శనివారం బయలుదేరినట్లు అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయానికి కొచ్చికి చేరుకుంటుందని అన్నారు. 588 మందిలో 70 మంది మహిళలు, 21 మంది చిన్నారులు ఉన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో వారిని తీసుకొచ్చే ప్రక్రియ కొంచెం ఆలస్యం అయినట్లు అధికారులు చెప్పారు. ఆపరేషన్ సముద్ర సేతు ఫేజ్–1లో భాగంగా ఇప్పటికే 698 మంది మనవాళ్లను ఇక్కడకు తీసుకొచ్చారు.