స్టూడెంట్లలో రోజురోజుకు పెరిగిపోతున్న ఫోన్ అడిక్షన్

స్టూడెంట్లలో రోజురోజుకు పెరిగిపోతున్న ఫోన్ అడిక్షన్
  • ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో స్పెషల్​ క్లాసులు

హైదరాబాద్, వెలుగు: లాక్​డౌన్ నుంచి పిల్లల్లో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా టైమ్​లో ఇండ్లలోనే ఖాళీగా ఉండడం, తర్వాత ఆన్​లైన్​క్లాసులు ఇలా వివిధ కారణాలతో ఫోన్లకు అతుక్కపోయే సమయం పెరిగిపోయింది. కరోనా పరిస్థితులు పోయి అంతా మామూలుగా మారినా పిల్లల్లో సెల్​ఫోన్ ​అడిక్షన్ ​ఇంకా పోలేదు. పైగా వారి ప్రవర్తన, ఆలోచనా విధానంలో విపరీతమైన మార్పులొచ్చాయి. ఫలితంగా అకడమిక్స్ లో వెనకబడిపోయారు. ఇలాంటి వారంతా సైకలాజికల్​గా మారేందుకు చాలా టైమ్​ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అధికంగా ఫోన్​వాడడం, సోషల్ మీడియాతో కలిగే నష్టాలను స్టూడెంట్లకు తెలిసేలా సిటీలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. స్పెషల్​క్లాసులు తీసుకుంటున్నారు. టీచర్లు పలు రకాల కొటేషన్లతో పోస్టర్లను తయారుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిస్తున్నారు. వాట్సాప్, ఇతర సోషల్ యాప్​ల ద్వారా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పదో తరగతి పిల్లల్లో బోర్డ్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఒత్తిడి మొదలైపోయింది. దీన్ని పోగొట్టి వారిని అకడమిక్స్​పై దృష్టి సారించేలా చేసేందుకు వారంలో ఒకరోజు కౌన్సిలింగ్, మోటివేషనల్ క్లాసులు తీసుకుంటున్నారు. ఇందుకోసం మెంటార్లను, క్లాస్ టీచర్లను అలాట్ చేస్తున్నారు.

చదువుపై దృష్టి పెట్టేలా..

స్టూడెంట్లలో ఫోన్ అడిక్షన్ రోజురోజుకు పెరిగిపోతుంది. వీటితో యాంగ్జైటీ, అడల్ట్ సెన్స్, అనవసరపు విషయాలపై ఆసక్తి, వయోలెన్స్ ఎక్కువగా ఉండే గేమ్‌‌‌‌లను ఆడటం పెరిగాయి. స్టడీస్​లో వెనుకబడటంతోపాటు అనారోగ్య సమస్యల పాలైనవారు చాలా మంది ఉన్నారు. స్కూళ్లు పూర్తిస్థాయిలో ఓపెన్ ​అయ్యాక కూడా చాలా మంది పిల్లల్లో ఇదే ధోరణి కొనసాగుతోంది. టీచర్లంటే భయం, గౌరవం లేకపోవడం, ఎదురించి మాట్లాడటం, క్లాసులు జరుగుతున్న టైంలో టీచర్లను కామెంట్ చేయడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టూడెంట్లను మెల్లమెల్లగా ఫోన్ల నుంచి బయట పడేసేందుకు హెచ్ఎంలు, టీచర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ల వాడకంతో కలిగే దుష్ర్పయోజనాలపై క్లాసులు తీసుకుంటున్నారు. మ్యూజికల్ థెరపీతో వారిలో పాజిటివిటీ పెంచేందుకు చూస్తున్నారు. అకడమిక్స్ మీద దృష్టి పెట్టేలా చేస్తున్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. 

మూడు నెలల్లో పరీక్షలు

మరో మూడు నెలల్లో పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పలు ప్రభుత్వ స్కూళ్లలో ఇంకా సిలబస్ కాలేదు. మరికొన్ని చోట్ల స్పెషల్ క్లాసులు, స్లిప్ టెస్ట్‌‌‌‌లు, డైలీ టెస్ట్‌‌‌‌లు నిర్వహిస్తూనే ఉన్నారు. అటు ప్రైవేట్​లోనూ స్పెషల్ క్లాసులు మొదలైపోయాయి. కొన్ని సబ్జెక్ట్‌‌‌‌లో వెనుకబడిపోయిన, అకడమిక్స్ లో అంతగా పెర్ఫామెన్స్ లేని స్టూడెంట్లపై టీచర్లు, మేనేజ్మెంట్ స్పెషల్ కేర్ తీసుకుంటు
న్నారు. స్టూడెంట్స్ అందరికి మెంటార్స్‌‌‌‌తో స్పెషల్ మోటివేషనల్ క్లాసులు ఇప్పిస్తున్నారు. వారంలో ఒకసారి ఇలా చేయడం వల్ల వారిలో పాజిటివ్ ఆలోచనలు పెరిగే అవకాశముందని హెచ్ఎంలు చెబుతున్నారు. 

చాలా మార్పులు గమనించాం

ఇప్పుడిప్పుడే స్టూడెంట్ల ప్రవర్తనలో మార్పులు చూస్తున్నాం. కరోనా టైమ్​లో వారిపై సెల్‌‌‌‌ఫోన్ ప్రభావం ఎక్కువగా పడింది. పోవడానికి చాలా టైమ్ పడుతుంది. స్కూళ్లు రీ ఓపెన్ ​చేశాక పిల్లల్లో ఎప్పుడూ లేని విధంగా బిహేవియర్​లో​  మార్పులు గమనించాం. ప్రస్తుతం వారిలో సానుకూల ఆలోచనా విధానం పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రతి క్లాస్​లో మ్యూజిక్​తో పాజిటివిటీ పెంచుతున్నాం. మోటివేషనల్ క్లాసులు తీసుకుంటున్నాం. ఫోన్లతో కలిగే నష్టాలను పోస్టర్ల ద్వారా పేరెంట్స్ కు తెలియజేస్తున్నాం.

– వాసిరెడ్డి అమర్‌‌‌‌‌‌‌‌నాథ్, 
డైరెక్టర్, స్లేట్ స్కూల్స్

షీ టీమ్స్ తో స్పెషల్​సెషన్స్

సోషల్ మీడియా ప్రభావంపై షీ టీమ్స్ ఆఫీసర్స్ వచ్చి స్కూళ్లోని స్టూడెంట్ల​తో జనరల్ టాక్ సెషన్ నిర్వహించారు. స్టూడెంట్లకు అర్థమయ్యేలా అన్ని అంశాలను వివరించారు. ఇన్‌‌‌‌స్టాగ్రామ్​లో ఫొటోలు, పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయడం వల్ల కలిగే నష్టాల గురించి చెప్పారు. చాలామంది స్టూడెంట్లు డౌట్లు అడిగారు. ఇలా స్టూడెంట్లకు  సోషల్ మీడియా, ఫోన్ వాడకంతో ఎదురుయ్యే ఇబ్బందులపై సెషన్లు నిర్వహిస్తున్నాం.

- శారద, హెచ్‌‌‌‌ఎం, గవర్నమెంట్ 
    హై స్కూల్, మాసబ్ ట్యాంక్‌‌‌‌