
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ IPS అధికారి, BRS నేత RS ప్రవీణ్ కుమార్కు SIT రెండో నోటీసు ఇచ్చింది. జులై 14 న సిట్ నోటీసులకు స్పందించక పోవడంతో రెండో సారి RS ప్రవీణ్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని తాజా నోటీస్లో సిట్ స్పష్టం చేసింది. ఎప్పుడు హాజరు అవుతారో తమకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సిట్ కోరింది.
తన ఫోన్ BRS ప్రభుత్వం హ్యాక్ చేస్తుందని, ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతుందని గతంలో BSP రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఈసీ, డీజీపీకి RS ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దాని ఆధారం గానే సిట్ ప్రవీణ్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో RS ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది.
పోలీస్ డిపార్ట్మెంట్లో కీలక విభాగాల్లో పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ సెక్రటరీగా పనిచేస్తూ 2021 జులైలో వీఆర్ఎస్ తీసుకుని బీఎస్పీలో చేరారు. అప్పటి నుంచి ఆర్ఎస్పీ కదలికల పైనా బీఆర్ఎస్ సర్కార్ నిఘా పెట్టింది. ఆర్ఎస్పీ ఫోన్ను ట్యాప్ చేసి ఆయన ప్రతి కదలికనూ సర్కారు పెద్దలకు ప్రణీత్రావు టీమ్ చేరవేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయారు. అయితే, ఫోన్ ట్యాపింగ్తో ఆర్ఎస్పీ లోటు పాట్లు తెలుసుకుని, బీఆర్ఎస్ లో చేరేలా పావులు కదిపారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐఏఎస్ దివ్యా దేవరాజన్, సిటీ మాజీ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ తో పాటు ఓ హైకోర్టు జడ్జి భార్య ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది.