ఫొటో తీస్తరు..చలాన్‌ చేతికిస్తరు

ఫొటో తీస్తరు..చలాన్‌ చేతికిస్తరు

స్వచ్ఛ ఉల్లంఘనులకు బల్దియా భారీ ఫైన్లు
సీఈసీ వెబ్ అప్లికేషన్‌‌తో పెనాల్టీ క్యూఆర్ కోడ్ జనరేట్
వివరాలు వెల్లడించిన మేయర్ రామ్మోహన్‌‌, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి

‘‘రోడ్ల మీదనే కనిపించే చెత్త.. ఎక్కడపడితే అక్కడ యూరిన్ చేయడాన్ని చూసి.. అబ్బా గలీజ్‌ సిటీ అనుకుంటాం. ఫలానా సిటీ ఎంత బాగుంటుందో అని వేరే నగరాల గురించి గొప్పగా చెప్పుకుంటాం. మళ్లీ మనమే ఇంట్లో చెత్త తీసుకెళ్లి రోడ్ల మీదే పడేస్తం . ఇట్లైతే సిటీ ఎట్లా శుభ్రంగా ఉంటది.
– నగర మేయర్ బొంతు రామ్మోహన్‌‌

ఎక్కడపడితే అక్కడ చెత్తేయడం..పబ్లిక్‌ ప్లేసుల్లో యూరిన్ పోయడం..ఇంట్లో చెత్తనంతా కవర్లలో తీసుకెళ్లి బయట పడేయడం.. బిల్డింగ్ వేస్టేజ్‌, ఇసుక, కంకర వంటివి రోడ్డుపై వేయడం చేస్తున్నారా? అయితే వెంటనే మానుకోండి . ఎందుకంటే స్వచ్ఛతకు సంబంధించిన ఏ రూల్​ బ్రేక్​ చేసినా ఇకమీదట భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. దీని కోసం జీహెచ్ఎంసీ విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్ సెల్ ఓ కొత్త వెబ్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి ఫొటోలు ‘సెంట్రల్​ ఎన్​ఫోర్స్ మెంట్ సెల్​’లో అప్ లోడ్ చేస్తే ఫైన్​కి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఆటోమేటిగ్గా జనరేట్ అవుతుంది. చలాన్‌ ఆ వ్యక్తికి అప్పటికప్పుడే ఇస్తారు. ఇప్పటికే సిటీలో 24 విభాగాలకు చెందిన 24 బృందాలు ఉల్లంఘనలకు పాల్పడ్డ వారి ఫొటోలు, వీడియోలు తీసి 1823 మందికి చలాన్లు పంపించాయి. 1,084 మంది నుంచి 1.50కోట్లు ఫైన్​ వసూలు చేశారు. ఈ–చలాన్‌తో పెనాల్టీ విధించే తొలి మున్సిపల్​కార్పొరేషన్​గా బల్దియా రికార్డు సాధించింది.

సిటీలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు ‘సెంట్రల్‌‌ ఎన్‌‌ఫోర్స్‌ మెంట్‌‌ సెల్’ ఓ కంప్యూటరైజ్‌డ్‌‌ అప్లికేషన్‌‌ రూపొందించింది. నగరాన్ని శుభ్రంగా.. అందంగా తీర్చిదిద్దుకోవడానికి అడ్డుపడుతున్నపనులపై దీని సాయంతో నజర్‌‌ వేస్తారు. ఫోటో లేదా వీడీయో తీయడం ద్వారా ఎలాంటి ఉల్లంఘన జరిగింది.. ఎంత ఫైన్‌‌ వేయాలనేది నిర్ణయిస్తారు. ఒకసారి చలాన్‌‌ జనరేట్‌‌ అయిన తర్వాత దాన్ని తొలగించేందుకు కానీ, తగ్గించేందుకు కానీ ఎలాంటి అవకాశం లేదు. ఎన్‌ఫోర్స్​మెంట్ విజిలెన్స్​ అండ్ డిజాస్టర్ మేనేజ్​మెంట్ (ఈవీడీఎం) డైరెక్టర్‌‌ విశ్వజిత్‌ కంపాటి లేదా మేయర్‌‌ బొంతు రామ్మోహన్‌‌ కూడా వీటిని మార్చలేకపోవమే దీని ప్రత్యేకత. ఆలస్యమైనా కూడా ఫైన్‌‌ చెల్లించాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ఫైన్‌‌ను కూడా ఇంటర్నెట్‌‌ బ్యాంకింగ్‌‌, క్రెడిట్‌‌, డెబిట్‌‌, యాప్‌‌ల ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో లిక్వ్‌‌డ్‌‌ క్యాష్‌‌ చెల్లింపులు స్వీకరించబడవు. ఒకవేళ డబ్బుల రూపంలో చెల్లించాలంటే బుద్ధ భవన్‌‌లోని హెడ్‌‌ ఆఫీస్‌‌లో మాత్రమే స్వీకరిస్తారు.

గమనిస్తున్నారు జాగ్రత్త
రోడ్ల మీద చెత్త వేయడం, ఇండ్ల వ్యర్థాలు పారబోయడం, చెరువుల్లో చెత్తా, చెదారం వేయడం
అందరికీ తెలిసిందే. పండుగలు, ఎన్నికలు, జాతర్లు, నాయకుల పుట్టిన రోజులు వచ్చాయంటే రోడ్లన్నీ
ఫ్లెక్సీ‌లతో నిండిపోతాయి. మళ్లీ బాధ్యత తమది కాదన్నట్టు ఎవరికి వాళ్లే వ్యవహరిస్తుంటారు. ఇలాంటివి
నివారించేందుకు ఈవీడీఎం కార్యాచరణ ప్రారంభించింది. 24 రకాల అతిక్రమణలకు జీహెచ్‌‌ఎంసీ పాత యాక్టు ప్రకారం ఫైన్‌‌ వేస్తున్నారు. విజిలెన్స్‌ శాఖలోని 24 బృందాలు రోజూ జోన్లు, సిబ్బంది వారీగా జంబ్లింగ్ పద్ధతిలో నగరంలో జరుగుతున్న అతిక్రమణలను గమనిస్తుంటారు. త్వరలోనే వీటి సంఖ్య 60కి చేర్చాలన్నది అధికారుల లక్ష్యం.

మట్టి దిబ్బలు పోయడం, చెత్త వేయడం, బహిరంగ మూత్ర విసర్జన, ఫ్లెక్సీలు, వాల్‌‌ రైటింగ్‌‌, వాల్‌‌ పెయింటింగ్‌‌.. ఇలా ఏది కనిపించినా ఫొటో లేదా వీడీయో తీసి అప్‌‌లోడ్‌‌ చేయడమే వీరి పని. క్యూ ఆర్‌‌ కోడ్‌‌తో సహా చలాన్‌‌ రెడీ అవుతుంది. అందులో ఏ జోన్‌‌లో.. ఎక్కడ.. ఏ సమయంలో.. ఎవరు ఫొటో తీశారనేది కూడా స్ఫష్టం గా ఉంటుంది. ఒకే ఫొటోలో రెండు భిన్న ఉల్లంఘనలు ఉన్నా కూడా వేర్వేరుగా నమోదవుతోంది. ప్రస్తుతం విజిలెన్స్‌ శాఖ వద్ద మాత్రమే యాప్ యాక్సెస్ ఉంది. త్వరలోనే జీహెచ్‌‌ఎంసీ ఉద్యోగులు, సిబ్బందికి కూడా దీన్ని ఇవ్వనున్నారు. వచ్చే మూడేండ్లలో నగరంలో ప్రతీ పౌరునికి సెంట్రల్ ఎన్ ఫోర్స్​మెంట్ సెల్ యాప్ (సీఈసీ) యాక్సిస్‌‌ ఇచ్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

1,084 మందికి రూ.1.50 కోట్ల ఫైన్‌
‌సీఈసీ యాప్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో 1,084 మందికి రూ.1.50 కోట్ల జరిమానా విధించారు. ఇందులో ప్రముఖ ఆస్పత్రులు, నిర్మాణ రంగ సంస్థలు, హోటళ్లు, విద్యాసంస్థలున్నాయి. కేవలం నెల రోజుల్లో సీఈసీ ద్వారా వీటికి ఫైన్‌‌ వేశారు. ఇందులో రూ.18.50లక్షల ఫైన్లను స్వచ్ఛందంగా చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు. జరిమానా చెల్లించడంతో పాటు అతిక్రమణలను సరిదిద్దుకోవడం కూడా ఒకేసారి జరుగుతూ
ఉంటాయి. ఉదాహరణకు ఒక బిల్డర్‌‌ భవన వ్యర్థాలను రోడ్ల మీద పారబోస్తే.. అక్కడి టీం ఫొటో
తీసిన వెంటనే రూ.25వేల ఫైన్‌‌ చలాన్‌‌ జనరేట్‌‌ అవుతోంది. ఫైన్‌‌ చెల్లింపుతో పాటు వ్యర్థాలను
కూడా సంబంధిత వ్యక్తి తొలగించాల్సి ఉంటుంది. లేదంటే సిస్టం ఆటోమేటిక్‌‌‌గా రెండోసారి అతిక్రమణ చేసినట్టు గుర్తించి రూ.50వేల చలాన్‌‌ జనరేట్‌‌ చేస్తుంది. నగరంలో మొత్తం 1,823 ఈ-నోటీసులు సీఈసీ యాప్ ద్వారా జనరేట్ అయ్యాయి.

అతిక్రమణ                                                           ఫైన్‌(రూ.)
నిర్మాణ, ప్రమాదకర వ్యర్థాలు
డంప్‌                                                మొదటిసారి 25 వేలు.. రెండో సారి 50వేలు, మూడోసారి రూ.లక్ష
బ్యానర్లు, కటౌట్లు పెడితే                         ఒక దానికి 5000
వాల్‌ పోస్టర్ అంటిస్తే                              ఒక పోస్టర్ కు 2000
రోడ్ల మీద వేస్ట్​ వేస్తే                               2000
వాల్‌ రైటింగ్‌కి                                      1000