ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్(PIB) కేఎస్ ధత్వాలియాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణయ్యింది. PIB కి నాయకత్వం వహించే ధత్వాలియా కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రధాన ప్రతినిధి. కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స కోసం ఆయనను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో గత రాత్రి 7 గంటల సమయంలో జాయిన్ చేశారు. అయితే అతని ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ధత్వాలియాకు కరోనా సోకడంతో జాతీయ మీడియా కేంద్రాన్ని సోమవారం(జూన్-8) రోజున మూసి, శానిటైజ్ చేయనున్నట్లు పీఐబీ అధికారులు తెలిపారు. అయితే ధత్వాలియా ఈ మధ్య జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నరేంద్ర సింగ్ తోమర్, ప్రకాష్ జవదేకర్లతో కలిసి సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో అతని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించడంపై అధికారులు దృష్టి సారించారు.