
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో జారీ చేయడం చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. నోటరీ ఆస్తుల క్రయవిక్రయాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జులై 26న జీవో 84 జారీ చేసింది. జీవో 84ను కొట్టేయాలని కోరుతూ ది భాగ్యనగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. సర్కార్ జీవో ప్రకారం125 చదరపు గజాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఆస్తులకు స్టాంప్ డ్యూటీ లేదా పెనాల్టీ ఉండదు. 125 గజాల కంటే ఎక్కువ భూమి అయితే రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చెల్లించాలి. పిల్లో చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.