కాళేశ్వరం ప్రాజెక్ట్ పై హై కోర్టులో పిల్ దాఖలు

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై హై కోర్టులో పిల్ దాఖలు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిల్ దాఖలైంది. మూడు టీఎంసీల  నీటిని పైప్ లైన్ ద్వారా తరలించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ఇంజినీర్ ఫోరమ్ కన్వీనర్ దొంతుల లక్ష్మీ నారాయణ పిల్ దాఖలు చేశారు. మూడు టీఎంసీల నీటిని పైప్ లైన్ ద్వారా తరలిస్తే 8 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని పిటిషనర్ ఆరోపించారు. ఇప్పటి వరకు రెండు టీఎంసీల నీటిని కెనాల్ గ్రావిటేషనల్ టన్నల్ అండ్ లిఫ్ట్ సిస్టం ద్వారా తరలించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఏటా వేయి కోట్ల రూపాయలు మెయిన్ టెనెన్స్ ఖర్చు  అవుతుందని పిటిషనర్ తెలిపారు.  పైప్ లైన్ పద్ధతి ద్వారా తరలిస్తే భూ సేకరణ  సమస్యతో పాటు, విద్యుత్ తదితర సమస్యలు ఎదురవుతాయని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.

మూడో టీఎంసీ నీటి తరలింపును పాత పద్ధతి ద్వారానే పనులు చేపట్టాలని పిటిషనర్ కోర్టును కోరారు. తెలంగాణ రాష్ట్రంలో  సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసీ) అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మించొద్దని ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిందని ఆయన కోర్టుకు తెలియజేశారు. ఇప్పటి వరకు 2 టీఎంసీల ల నీటిని కెనాల్ గ్రావిటేషనల్ టన్నల్  అండ్ లిఫ్ట్ సిస్టం ద్వారానే నీటిని తరలించారని పిటిషనర్ తెలిపారు. మెడి గడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు కాలువల ద్వారానే పనులు జరిగాయని పిటిషనర్ తెలిపారు. దీంతో ఐదుగురు ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్,  ప్రిన్సిపల్  సెక్రెటరీ, ఇరిగేషన్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్,  మినిస్టర్  ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్  క్లైమేట్ చేంజ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది  హైకోర్ట్. నాలుగు వారాల్లోగా దీని పై  పూర్తి నివేదిక సమర్పించాలని ప్రతివాదులకు హైకోర్ట్ ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.