ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ములాయం మృతి పట్ల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి అధికార లాంఛనాలతో ములాయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో ఫోన్లో మాట్లాడిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ... సామాజిక సిద్ధాంతం కోసం ములాయం తుది వరకు పోరాటం చేశారన్నారు. అనంతరం యూపీ స్పీకర్ సతీశ్ మహానా కూడా ములాయం మృతి పట్ల సంతాపం తెలిపారు.
82ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. దీంతో ఈ రోజు ఉదయం హర్యానా గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్.. అప్పట్నుంచి అక్కడే చికిత్స పొందుతూ... ప్రాణాధార వ్యవస్థపై ఉన్నారు. ములాయం అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సైఫయిలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కార్యాలయం తెలిపింది.