పంజాగుట్ట, వెలుగు: షర్మిలపై వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న కామెంట్లను ఖండిస్తున్నామని పిట్ట రామ్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని, లేదంటే తగినవిధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. షర్మిలపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు.
జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు షర్మిల 3,800 కిలో మీటర్ల పాదయాత్ర చేశారన్నారు. ఏది ఉన్నా ఆమె సూటిగా మాట్లాడుతారని చెప్పారు. ఆమెపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతోనే షర్మిల భద్రత తగ్గించారన్నారు. రాజకీయంగా ఎంతైనా విమర్శలు చేయొచ్చని.. వ్యక్తిగతంగా ఎవరినీ బాధపెట్టొద్దని సూచించారు. జగన్ ప్రభుత్వం షర్మిలను చూసి భయపడుతున్నదని విమర్శించారు. తెలంగాణలో నియంత కేసీఆర్ను గద్దె దించేందుకు ఆమె పోరాటం చేశారని గుర్తు చేశారు.