ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం కొనుగోలు

ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం కొనుగోలు

తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళిక ఉందా అని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే. కేశవరావు రాజ్యసభలో  ప్రశ్నించారు. గతేడాది తమ దగ్గర మిగిలిపోయిన 94 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకున్నారని... ఈసారి మాత్రం 19 లక్షల టన్నుల ధాన్యాన్నే సేకరించారని కేశవరావు అన్నారు. గతేడాది మాదిరిగా కనీసం 94 లక్షల టన్నులు తీసుకుంటారా అని ఆయన అడిగారు?

కేశవరావు ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. ‘మీరు చెప్తున్న ఇతర స్టేట్ మెంట్ ల అంశం నాకు తెలియదు. దేశ వ్యాప్తంగా ధాన్యం సేకరణను కేంద్ర ప్రభుత్వం గణనీయంగా పెంచుతూ వస్తోంది. తెలంగాణ రాష్ర్టంలో 51.9 నుంచి 74.54కు ఆ తర్వాత 94.54 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాం. కనీస మద్ధతు ధర పెంచాం. దాంతో పాటుగా ధాన్యం సేకరణ పరిమాణం కూడా పెంచాం. రైతు ప్రయోజనల పట్ల చాలా బాధ్యత కలిగిన ప్రభుత్వం మాది. 2020-2021 ఖరీఫ్ సీజన్ లో మాకు 50 లక్షల టన్నుల అంచనాలు  పంపించారు. కానీ మాకు మాత్రం 32.66 లక్షల టన్నుల మాత్రమే ఇచ్చారు. అదేవిధంగా రబీ సీజన్ లో 55 లక్షల మెట్రిక్ టన్నుల ప్రతిపాదనలు చెప్పారు. కానీ 61.87 లక్షల టన్నులు మాత్రమే పంపారు. మొత్తంగా 94.53 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ధాన్యం కొనుగోలు విషయాన్ని రాజకీయంగా ఎందుకు లేవనెత్తుతున్నారు? మా అధికారులు ధాన్యం నిల్వలను భౌతికంగా  పరిశీలించారు. సరైన పద్ధతిలో నిల్వ ఉంచలేదు, అవకతవకలు కనిపించాయి. అన్ని రకాలుగా తెలంగాణకు సహాయం అందిస్తున్నాం. ఎంవోయూ ఉంది.. దాని ప్రకారమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయినా ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావడం లేదు. వాళ్లు పదే పదే ఎందుకు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారో అర్ధం కావడం లేదు’ అని గోయల్ తెలిపారు.

కాగా.. కేశవరావు కలిపించుకొని.. మీరు భాద్యత కలిగి ఉన్నారు.  అందుకు మేం ధన్యవాదలు చెప్తున్నాం. అలాగే ఉండాలని కోరుతున్నాం. 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కట్టుబడి ఉండాలి. అలాగే గతంతో పోల్చితే 60 శాతం దిగుబడి పెరిగింది. రబీలో బాయిల్డ్ రైస్ ఎంత తీుసుకుంటారో చెప్పండని కోరారు.

వెంటనే స్పందించిన పీయూష్ గోయల్.. మొదట ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయండి.. సమస్య వస్తే ఆ  తర్వాత చర్చిద్దామని అన్నారు. ‘ఎంవోయూ ప్రకారం ధాన్యం సరఫరా చేయండి. ఎంవోయూ ప్రకారం మొదట రైస్ కొనండి. రాష్ట్రాల అవసరాల అనంతరం ధాన్యం తరలింపుపై ఎఫ్ సీ ఐ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత సెంట్రల్ పూల్ కు పంపడం జరుగుతుంది. ప్రస్తుతం ఎంత అవసరం ఉందో రాష్ట్రాలు అంత ధాన్యం తీసుకోవాలి’ అని సమాధానమిచ్చారు.


నాలుగైదేళ్ల నుంచి సాగునీటి రంగంపై దృష్టి పెట్టడం కారణంగా పంట సాగు విస్తిర్ణం, దిగుబడి పెరిగిందని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి అన్నారు. ‘మా దగ్గర అవసరాలకు మించి ధాన్యం ఉంది.. అయినా మేం కొనం అంటున్నారు. మీ దగ్గర అవసరాలకు సరిపడా పారాబాయిల్డ్ రైస్ ఉందా? రబీ సీజన్ లో వరి ధాన్యం సాగు ప్రారంభమైంది. రబీ సీజన్ లో వరిధాన్యం కొనుగోలు చేస్తారా? లేదా? అని సురేష్ రెడ్డి ప్రశ్నించారు.

సురేష్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం చెప్పారు. ‘గతేడాది 61.92 లక్షల టన్నులని చెప్పారు, కానీ 42.99 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. తెలంగాణతో పాటు దేశంలోని రాష్ట్రాలన్నీ కర్ణాటక విధానాన్ని అవలంబించాలి. వారు ఖచ్చితమైన వివరాలు ఇస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణకు 29 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇచ్చాం. పదే పదే సేకరణను పొడిగించాలని కోరుతున్నారు. ఇప్పటికే అయిదుసార్లు పొడగించాం. మొదట 24.75 పారాబాయిల్డ్ టార్గెట్ ఇచ్చాం. ఆ తర్వాత ఒక్కసారిగా 44 లక్షల టన్నులకు పెంచాం. కానీ 27.78 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. ఇప్పటికి 17లక్షల టన్నుల రైస్ ఇంకా సరఫరా చేయలేదు. ఒప్పకున్నది సరఫరా చేయకుండా భవిష్యత్ గురించి అడుగుతున్నారు. యూనిఫాం పాలసీ కోసం ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర అవసరాల మేరకు ధాన్యం కొనుగోలు జరుగుతుంది. వీళ్లేమో సేకరణ గురించి మాట్లాడుతున్నారు. పారాబాయిల్డ్ రైస్ ఎఫ్ సీ ఐకి సరఫరా చేయమని ఒప్పుకున్నారు. మొదట 17లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సరఫరా చేయండి. కొంత ధాన్యం మిగిలి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు, దాన్ని సర్దుబాటు చేస్తామని చెప్పాం’ అని గోయల్ చెప్పారు.