గ్రేటర్ వరంగల్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం మిత్ర పథకం వర్చువల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఇండియన్ టెక్స్టైల్స్ మినిస్ట్రీ సెక్రటరీ నీలం షమీ రావు పరిశీలించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం టీఎస్ఐఐసీ ఎండీ శశాంక్తో కలిసి జిల్లాలోని మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనుల పురోగతి, వర్చువల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పన, పార్క్ ద్వారా కలిగే ఉపాధి అవకాశాలు, స్థానిక అభివృద్ధిపై అధికారులు విస్తృతంగా చర్చించారు.
ఈ పథకం ద్వారా వరంగల్ జిల్లా జాతీయ స్థాయిలో టెక్స్టైల్ రంగంలో కీలక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మెగా టెక్స్టైల్ పార్క్ జోనల్ మేనేజర్ స్వామి, వరంగల్ ఆర్డీవో సుమ, సంగెం, గీసుకొండ తహసీల్దార్లు రియాజుద్దీన్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. అంతకుముందు ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు అతనికి భద్రకాళి అమ్మవారి ఫొటో, శేష వస్ట్రాలు అందజేశారు. కార్యక్రమంలో టెక్స్టైల్స్ డైరెక్టర్ అనిల్కుమార్, భద్రకాళి టెంపుల్ ఈవో సునీత ఉన్నారు.
