- స్వయంగా కలిసి ఆహ్వానించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు.
కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎంలు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది. సదస్సుకు ఆహ్వానించే వారి స్థాయికి తగినట్లు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆహ్వానం పలకనున్నారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీని నియమించనున్నారు. ఈ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్సైట్ను ఏర్పాటు చేస్తారు.
ఎవరిని ఆహ్వానించారు.. ఎవరు ఆహ్వానించారు.. వారి రాకను నిర్ధారించడం, వచ్చే వారికి తగిన వసతులు కల్పించడంతో పాటు వారికి లైజనింగ్ చేసేందుకు ఉన్నతాధికారుల నియామకం అన్నింటిని ఆహ్వాన కమిటీ నిర్ధారించనుంది. ఈ ఆహ్వాన కమిటీని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమన్వయం చేయనున్నారు. ఆహ్వానాలకు సంబంధించి వివరాలను డ్యాష్బోర్డ్ ద్వారా సీఎం పర్యవేక్షించనున్నారు.
