కాంగ్రెస్–ఆర్జేడీ బంధం నూనె, నీళ్ల లాంటిది: ప్రధాని మోదీ

కాంగ్రెస్–ఆర్జేడీ బంధం నూనె, నీళ్ల లాంటిది: ప్రధాని మోదీ
  • అవి ఎప్పుడూ కలిసి ఉండవు.. ఒక్క మాట మీద నిలబడవు: ప్రధాని మోదీ
  • నన్ను అవమానించడమే జన్మహక్కుగా రాహుల్​, తేజస్వీ ఫీల్​ అవుతున్నరు
  • మళ్లీ దోచుకోవడానికే వాళ్లు జనం ముందుకు వస్తున్నరు
  • ఛత్​ పూజను కూడా అవమానించారని ఫైర్​
  • బిహార్​లో  మోదీ ​ ప్రచారం

పాట్నా: కాంగ్రెస్​, ఆర్జేడీ పార్టీలది నూనె, నీళ్ల లాంటి బంధమని.. ఎప్పుడూ ఆ రెండు పార్టీలు ఒక మాట మీద ఉండవని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. తనను అవమానించడం వారి జన్మహక్కు అన్నట్లుగా రాహుల్​గాంధీ, తేజస్వీ యాదవ్​ భావిస్తున్నారని.. వారికి ఓటర్లే బుద్ధిచెప్తారని పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ప్రధాని మోదీ ముజఫర్​పూర్​లో పర్యటించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ఆర్జేడీ కూటమి ‘మహాఘట్​బంధన్’​పై విమర్శలు గుప్పించారు. పోలింగ్​ కంటే ముందే కూటమి​లో చీలికలు వచ్చాయన్నారు. అలాంటి పార్టీలు ప్రజలకు ఏంచేస్తాయని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్, ఆర్జేడీ బంధం నూనె, నీళ్ల లాంటిది. బాటిల్​లో నూనె, నీళ్లను పోస్తే.. అవి ఎప్పుడైనా కలిసి ఉంటాయా? ఈ రెండు పార్టీలూ అంతే” అని ఆయన వ్యాఖ్యానించారు.

జంగల్​ రాజ్​ వద్దు

బిహార్​లో ఆర్జేడీ పాలన జంగల్​ రాజ్​ లాంటిదని.. అలాంటి పాలనను ఇక్కడ ప్రజలు ఎవరూ కోరుకోవడంలేదని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఆర్జేడీ జంగల్​ రాజ్​ పాలనలో అన్నిట్లో అవినీతి. దేనినీ వదలలేదు. వాళ్ల హయాంలో 35వేలకు పైగా కిడ్నాప్​ కేసులు నమోదయ్యాయి. ఆటవిక రాజ్యం నడిపారు. అలాంటి పాలన వద్దు” అని పేర్కొన్నారు. 

‘‘ఎన్నికల ర్యాలీల్లో కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ నన్ను అవమానించడమే పనిగా పెట్టుకున్నారు. ఇతరులను.. ముఖ్యంగా నన్ను అవమానించడం వాళ్ల జన్మహక్కు అన్నట్లుగా భావిస్తున్నారు. బిహార్​ను మళ్లీ దోచుకోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్​ కలిసి జనం వద్దకు వస్తున్నాయి” అని మోదీ దుయ్యబట్టారు. ఆర్జేడీ, కాంగ్రెస్​ ఏనాడూ బిహార్​ అభివృద్ధి కోసం పాటుపడలేదని.. దోచుకోవడమే ఆ పార్టీల పని అని ఆరోపించారు.

 ‘‘ఆర్జేడీ – కాంగ్రెస్​ పాలనను ఐదు పదాల్లో చెప్పొచ్చు. 1. కట్టా (నాటు తుపాకులు), 2. క్రూరతా (క్రూరత్వం), 3. కటుతా (సామాజిక అసహనం), 4. కుషాసన్​ (దుష్పరిపాలన), 5. కరప్షన్​ (అవినీతి). దీన్ని సమాజం ఎప్పటికీ స్వాగతించదు” అని ఆయన పేర్కొన్నారు. 

వాళ్లు ఛత్​ పూజనూ అవమానించారు

ఎంతో పవిత్రమైన ఛత్​ పూజను ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు అవమానించారని.. డ్రామాలంటూ ఇష్టమున్నట్లు మాట్లాడారని ప్రధాని మోదీ అన్నారు.