న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్పై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పెగాసస్ ద్వారా ప్రధాని మోడీ మన ఫోన్లలో ఒక ఆయుధాన్ని పెట్టారని, దీని ద్వారా మన దేశ ప్రజాస్వామిక మూలాలను దెబ్బకొడుతున్నారని ఆరోపించారు. పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కి దీనిపై చర్చ జరగకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. పెగాసస్ స్పైవేర్తో రాజకీయ నేతలు, పలువురు జర్నలిస్టుల ఫోన్లను కేంద్ర ప్రభుత్వం హ్యాక్ చేసిందంటూ వార్తా కథనాలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలు నిత్యం పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తున్నాయి. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు.. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఎలాంటి వ్యూహం పాటించాలనే దానిపై చర్చించడానికి కాంగ్రెస్ సహా 14 పార్టీల నేతలు ఈ రోజు ఢిల్లీలో సమావేశమయ్యారు.
ప్రతిపక్షాల నేతలతో సమావేశం ముగిశాక రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలూ ఇక్కడ ఉన్నాయని, పార్లమెంటులో తమ గొంతును ప్రభుత్వం నొక్కేస్తోందని ఆయన అన్నారు. పెగాసస్ సాఫ్ట్వేర్ను కేంద్రం కొనడం నిజమేనా, కాదా? ఒక వేళ కొంటే కొందరు వ్యక్తులను టార్గెట్ చేసి వారి ఫోన్లను హ్యాక్ చేయడం నిజం కాదా అని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని రాహుల్ చెప్పారు. తాను ప్రజలను ఒక్కటే అడగాలనుకుంటున్నానని, స్పై చేయడానికి మీ ఫోన్లలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఆయుధాన్ని పెట్టారని, దీనిపై పార్లమెంటులో చర్చ జరగలా వద్దా చెప్పాలని అన్నారు. పెగాసస్పై ప్రతిపక్షాలు సైలెంట్ అయితే ఈ విషయాన్ని తొక్కిపెట్టేస్తారని, దీనిపై చర్చ జరిగే వరకూ తాము వదలబోమని రాహుల్ చెప్పారు. తాము పార్లమెంటులో నిరసనలు చేస్తూ సభను అడ్డుకుంటున్నామని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, కానీ తమ భాద్యతను నిర్వర్తిస్తున్నామని ఆయన అన్నారు.