- కలిసి ప్రారంభించిన ప్రధాని మోడీ, నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలి
- 60 కిలోమీటర్ల పొడవు..రూ. 324 కోట్ల ఖర్చు
- దక్షిణాసియాలోనే మొదటి ప్రాజెక్టుగా రికార్డు
న్యూఢిల్లీ/కాట్మాండు: సౌత్ ఏషియాలో రెండు దేశాల మధ్య నిర్మించిన మొట్టమొదటి పెట్రోలియం పైప్లైన్ను ఇండియా, నేపాల్ ప్రధానులు కలిసి ప్రారంభించారు. న్యూఢిల్లీలో మోడీ, కాట్మాండులో కేపీశర్మ ఓలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ప్రాజెక్టును స్విచ్ఆన్ చేశారు. డీజిల్, పెట్రోల్ ఇతర పెట్రోలియం ఉత్పత్తుల్ని సరఫరా చేసేందుకు బీహార్లోని మోతీహరీ నుంచి నేపాల్లోని అమ్లేఖ్గంజ్ వరకు ఈ పైప్లైన్ను నిర్మించారు. ఇండియా, నేపాల్ మధ్య ఫ్రెడ్షిప్కి ఇదొక నిదర్శనమని మోడీ అన్నారు. డెడ్లైన్ 30 నెలలైనా రెండు దేశాల కృషితో15 నెలల రికార్డు టైమ్లో పైప్లైన్ నిర్మాణం పూర్తయిందని చెప్పారు. పైప్లైన్ ద్వారా తక్కువ ఖర్చుతో, అందుబాటు ధరలో నేపాల్కు పెట్రోలియం సరఫరా అవుతుందని, అలా మిగిలిన డబ్బును సంక్షేమ కార్యక్రమాలకు వాడతామని ఓలీ ఇదివరకే చెప్పారని మోడీ గుర్తుచేశారు. పెట్రోలియం పైప్లైన్ నిర్మాణం నేపాల్ చరిత్రలోనే గొప్ప విజయమని కేపీ శర్మ ఓలి అన్నారు. ఈ ప్రాజెక్టు.. సౌత్ఏషియాలోని మిగతా దేశాలకూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
పెట్రోలియం పైప్లైన్ విశేషాలివే
పైప్లైన్ పొడవు 60 కిలోమీటర్లు. రూ.324 కోట్ల ఖర్చుతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ), నేపాల్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(ఎన్ఓసీఎల్) జాయింట్గా నిర్మించాయి. దీనికి ఆర్మీ ఆధ్వర్యంలో సెక్యూరిటీ కల్పిస్తారు. పైప్లైన్కు అనుబంధంగా నేపాల్వైపు రూ.75 కోట్లతో స్టోరేజీ ఫెసిలిటీని నిర్మిస్తారు. 1973 నాటి ఒప్పందంతో ఇండియా నుంచి నేపాల్కు ట్యాంకర్ల ద్వారా పెట్రోలియం ఉత్పత్తుల రవాణా జరిగేది. 1996లో పైప్లైన్ ప్రపోజల్ వచ్చింది. 2014లో మోడీ కాట్మాండు పర్యటన సందర్భంలో పైప్లైన్ ప్రాజెక్టుపై రెండు దేశాలు సంతకం చేశాయి. ఇప్పుడది అందుబాటులోకి రావడంతో రవాణా ఖర్చులు తగ్గి, లీకేజీని పూర్తిగా అరికట్టినట్లవుతుంది. తద్వారా నేపాల్కు రెండు బిలియన్ డాలర్ల సొమ్ము ఆదా అవుతుంది.