
- తయారు చేస్తున్న ఆదివాసీ మహిళలు
- మన్ కీ బాత్లో ప్రశంసించిన మోదీ
- ‘గిరి శానిటరీ ప్యాడ్స్’ పేరుతో నాప్కిన్ల తయారీ
- మహిళా సాధికారతకు నిదర్శమని ప్రధాని ప్రశంస
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలోని ఆదివాసి మహిళలు శ్రీరామ ‘భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్’ పేరిట బిస్కెట్లు తయారు చేస్తున్నారు. ఇవి హైదరాబాద్ నుంచి లండన్కు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. స్వయంగా రాగులు, జొన్న పంటలు సాగు చేస్తూ.. వాటితో బిస్కెట్లు చేస్తున్నారు. ఒకప్పుడు పొలాల్లో కూలి పనులకు వెళ్లే మహిళలంతా.. ఇప్పుడు స్వయం సహాయక బృందాల ద్వారా ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రశంసించారు. ఇది గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు, దేశ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపుకు నిదర్శనమని కొనియాడారు. బిస్కెట్ల తయారీతోనే ఆగకుండా.. పర్యావరణ అనుకూల శానిటరీ ప్యాడ్స్ను కూడా తయారు చేస్తున్నారని మోదీ తెలిపారు. లోకల్ స్కూళ్లు, ఆఫీసులకు శానిటరీ ప్యాడ్స్ను తక్కువ ధరకే సప్లై చేస్తున్నారని, ఈ ప్రయత్నం మహిళల ఆరోగ్యం, పరిశుభ్రతను ప్రోత్సహించడంతో పాటు వారికి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కల్పిస్తున్నదని ప్రశంసించారు. నెలకు 40వేల శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్నట్లు వివరించారు.
20 బిస్కెట్ల డబ్బా రూ.150
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీరామ జా యింట్ లయబులిటీ గ్రూపు ఆధ్వర్యంలో మహిళలు రాగి, జొన్న బిస్కెట్లు తయారు చేస్తున్నారు. రాగి, జొన్న బిస్కెట్ల తయారీకి ట్రైనింగ్, మిషన్లను సమకూర్చడంలో ఐటీడీఏ సహకరించింది. గతంలో శానిటరీ ప్యాడ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు నిధులు ఇచ్చింది. అం దులో మిగిలిన డబ్బులతో బిస్కెట్ తయారీ యూనిట్ ను నెలకొల్పారు. మిల్లెట్ బిస్కెట్ల తయారీలో ఆదివాసీ మహిళలు హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ట్రై నింగ్ తీసుకున్నారు. రాగులు, జొన్న పిండి, బెల్లం, బటర్, నెయ్యి సహాయంతో రాగి, జొన్న బిస్కెట్లను తయారు చేస్తున్నారు. ఒక కేజీకి 8 డబ్బాలు తయారు చేస్తున్నారు. ఒక్కో డబ్బాలో 20 బిస్కెట్లు ఉంటాయి. ఈ డబ్బాను రూ.150 అమ్ముతున్నారు. ఇలా రోజుకు 40 డబ్బాల బిస్కెట్లను తయారు చేస్తున్నారు.
గిరి శానిటరీ ప్యాడ్స్ కు డిమాండ్
భద్రాద్రి శ్రీరామ శానిటరీ ప్యాడ్ యూనిట్ ఆధ్వర్యంలో గిరిజన మహిళలు తయారు చేస్తున్న ‘గిరి శానిటరీ ప్యాడ్స్’కు డిమాండ్ పెరుగుతున్నది. ఏండేండ్ల కింద ఈ యూనిట్ ఏర్పాటు చేశారు. రాజస్థాన్ నుంచి వచ్చిన నిపుణులు.. శానిటరీ ప్యాడ్ల తయారీలో గిరిజన మహిళలకు ట్రైనింగ్ ఇచ్చారు. 3 నెలలకు 40వేల ప్యాడ్లు తయారు చేస్తున్నారు. వీటిని జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలకు సరఫరా చేస్తున్నారు. ఒక ప్యాకెట్ విలువ రూ.28. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని విద్యాసంస్థలకు సరఫరా చేయడంతో విశేష స్పందన వచ్చింది. ములుగు, ఏటూరునాగారం, నల్లగొండకు సైతం గిరి శానిటరీ ప్యాడ్లు సరఫరా చేస్తుండటం విశేషం.
ఎంతో సంతోషంగా ఉంది: కలెక్టర్, పీవో
భద్రాద్రికొత్తగూడెం జిల్లాతో పాటు, భద్రాచలం ఐటీడీఏకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గిరిజన మహిళలు పేరు తీసుకురావడం ఆనందంగా ఉందని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఐటీడీఏ పీవో బి.రాహుల్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో గిరిజన మహిళలు ముందుకు సాగాలని, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్గానిక్ స్నాక్స్ తయారు చేయాలని సూచించారు. రాగులు, జొన్నలు, సజ్జలు పొలాల్లో పండించాలని, నెయ్యి గ్రామాల్లో తయారు చేసుకోవాలని అప్పుడు మరింత లాభాలు పొందొచ్చని గిరిజన మహిళలకు తెలిపారు. మన్కీబాత్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించి నేపథ్యంలో గిరిజన మహిళలు తాము తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లను ఏఎస్పీ విక్రాంత్సింగ్ కుమార్తో పాటు ట్రైనీ ఐఏఎస్ సౌరభ్ శర్మకు అందజేశారు