రాష్ట్ర ప్రజల కల సాకారం అయింది. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారాన్ని ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్లాంట్ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. తెలంగాణతో పాటు..దక్షిణాది రాష్ట్రాల్లో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారం ద్వారా ఎరువుల కొరత తీరనుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఆరు సంస్థల భాగస్వామ్యంతో FCI , RFCL గా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించారు. ఈ కార్మాగారాన్ని గ్యాస్ ఆధారితంగా రూపొందించారు. ఈ కర్మాగారం పునరుద్ధరణకు రూ. 6,338 కోట్లను కేటాయిచారు. ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా రామగుండం ఎరువుల కర్మాగారం పనిచేయనుంది. ఇందులో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్స్ని తెలంగాణకి కేటాయిస్తారు. మొత్తంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసే ఎరువుల్లో 46 % ఎరువులను తెలంగాణకి ఉపయోగించనున్నారు. మిగిలిన 54 శాతాన్ని ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
2015 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వం RFCL నిర్మాణ పనులను ప్రారంభించింది. 2016 ఆగస్టు 7న గజ్వేల్ లో ప్రధాని నరేంద్ర మోడీ దీనికి వర్చువల్గా శంకుస్థాపన నిర్వహించారు. ఆ తర్వాత2020 ఫిబ్రవరి 21న ట్రయల్ రన్ మొదలైంది. 2021 మే 28 నాటికి పూర్తిస్థాయి ఉత్పత్తి దశకు చేరుకుంది. ప్రస్తుతం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో రోజుకు 2200 టన్నుల అమోనియా.. 3850 టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తున్నారు.