- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం
న్యూఢిల్లీ, వెలుగు: అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రం కావడంతో కేంద్రం అలర్ట్ అయింది. దేశంలో ఇంధన నిల్వలు, పెట్రోల్ బంక్ల మూసివేత, లాక్డౌన్ వంటి వార్తలపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా ఇరాన్ యుద్ధంపై చర్చించనున్నారు.
కాగా.. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని, దేశ ప్రజలు ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వదంతులను అడ్డుకోవడం, ప్రజల్లో భయాందోళనలు కలగకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రాల వారీగా గ్యాస్, పెట్రోల్ సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వివరించే అవకాశం ఉంది. సీఎంలతో భేటీ తర్వాత ఇంధన వినియోగం, ధరల నియంత్రణపై కేంద్రం మరిన్ని కీలక మార్గదర్శకాలు జారీ చేసే చాన్స్ ఉందని తెలుస్తోంది.
