న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేదల బతుకులను మార్చేందుకు యువత కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని ప్రధాని మోడీ కోరారు. విద్యార్థులకు ఈజ్ ఆఫ్ డూయింగ్ సౌకర్యం కల్పిస్తామని.. ప్రతిఫలంగా పేదల బతుకులను సౌలభ్యంగా మార్చే ఆవిష్కరణలను చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశ అవసరాలను గుర్తించి వాటిని సాకారం చేసే దిశగా యువత కృషి చేయాలన్నారు. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్స్ బ్యాచ్తో నిర్వహించిన కాన్ఫరెన్స్లో మోడీ పైవ్యాఖ్యలు చేశారు.
‘భారత్కు యువకులే బ్రాండ్ అంబాసిడర్లు. మీకు నేర్చుకోవడానికి చాలా సమయం దొరుకుతుంది. సమయాన్ని తగిన విధంగా వాడుకుంటూ మంచి భవితను నిర్మించుకోండి. నాణ్యతపై ఎక్కువగా దృష్టి పెట్టండి. ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వకండి. మీ ఆవిష్కరణలు అందరికీ చేరేలా యత్నించండి. మార్కెట్లో నమ్మకాన్ని పెంచుకోండి. మార్పులకు సిద్ధంగా ఉంటూ జీవితంలో వచ్చే అనిశ్చితులను అధిగమించండి’ అని మోడీ పేర్కొన్నారు.